
ప్రయాణికులపై టోల్ భారం
హన్మకొండ: ఆర్టీసీ ప్రయాణీకులపై టోల్ భారం పెరిగింది. ఈనెల 8 నుంచి టోల్ గేట్ల వద్ద రేట్లు పెంచడంతో ఆమేరకు ఆర్టీసీ చార్జీలు పెంచింది. వరంగల్ రీజియన్ బస్సులు నడిచే రెండు రూట్లలో టోల్ గేట్లు ఉన్నాయి. హనుమకొండ – ఏటూరునాగారం రూట్లో ములుగు సమీపంలో, హనుమకొండ – హైదరాబాద్ రూట్లో రఘునాథపల్లి, బీబీనగర్ వద్ద టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్కు రూ.10 చొప్పున ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న చార్జీలపై ప్రతీ బస్సుకు హైదరాబాద్ రూట్లో రూ.20 చొప్పున, ఏటూరునాగారం రూట్లో రూ.10 చొప్పున, హనుమకొండ – జనగామకు రూ.10 చొప్పున, జనగామ – హైదరాబాద్ రూట్లో తిరిగే బస్సులకు రూ.10 చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచింది.