
గిరిజనుల సంక్షేమానికి కృషి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పర్వతగిరి: గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఈ మేరకు మండలంలోని సోమారం, గోరుగుట్టతండా, జగ్గుతండాలో రూ.2.20 కోట్ల ఎస్టీఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా, ఆరోగ్యం, విద్య తదితర సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, తండాల్లో వసతులు కల్పిస్తామని తెలిపారు. త్వరితగతిన అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్నాయక్, నాయకులు రాఘవులు, భాస్కర్, మహ్మద్అలీ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బాధ్యతలు స్వీకరించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు దేవాలయానికి వచ్చిన కలెక్టర్ను ఘనంగా స్వాగతించారు. కలెక్టర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కలెక్టర్తో పాటు ఆమె తల్లిదండ్రులు, కూతురు, కుమారుడు ఉన్నారు. పూజల అనంతరం అర్చకులు మహదాశ్వీచనం అందజేశారు. ఈఓ శేషుభారతి వారికి అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు.
ట్రాన్స్కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ విజేత నల్లగొండ
హన్మకొండ: తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025–2026 శుక్రవారం ముగిసింది. బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వరంగల్, మహబూబ్నగర్ జట్లు పోటీ పడగా, వరంగల్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల జట్టు విజేతగా నిలిచింది. మహబూబ్నగర్ జట్టు ద్వితీయ స్థానంలో, నల్లగొండ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. కబడ్డీ ఫైనల్లో నల్లగొండ, వరంగల్ జట్లు పోటీపడగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. వరంగల్ జట్టు ద్వితీయ స్థానం, నిజామాబాద్ తృతీయ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో కబడ్డీలో 12 జట్లు, బాల్ బ్యాడ్మింటన్లో 9 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్ట జుజీజ్చి బి.అశోక్ కుమార్, టి.మధుసూదన్, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్, హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, కన్వీనర్ ఎ.విజేందర్రెడ్డి, సభ్యులు ఎండీ యాకూబ్ పాషా, సునీల్ కుమార్, ఇ.ప్రేమ్ కుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి, వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ పాల్గొన్నారు.
మనస్తాపంతో
వ్యక్తి ఆత్మహత్య
సంగెం: కుమారుడు రోడ్డు ప్రమాదం చేశాడని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీఆర్ఎన్ తండాకు చెందిన గుగులోత్ వెంకట్రాం (37)కు భార్య అనిత, ఇద్దరు కుమారులున్నారు. మే 29న ఆయన పెద్ద కుమారుడు లోకేశ్ పల్లారుగూడ గ్రామానికి చెందిన కక్కెర్ల చిరంజీవి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. చిరంజీవి ఎడమకాలు విరిగి ఆస్పత్రిలో చేరాడు. తన కుమారుడిని ఢీకొట్టిన లోకేశ్పై చర్య తీసుకోవాలని ఈనెల 12న సంగెం పోలీస్స్టేషన్లో చిరంజీవి తల్లి సరోజన ఫిర్యాదు చేసింది. కుమారుడిపై కేసు నమోదైందని మనస్తాపం చెందిన వెంకట్రాం శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన భార్య అనిత.. వెంకట్రాం కిందపడి ఉండి నోటి నుంచి నురగలు వస్తున్నట్లు గమనించింది. వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆయన మృతి చెందాడు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.

గిరిజనుల సంక్షేమానికి కృషి

గిరిజనుల సంక్షేమానికి కృషి