
లింగ వివక్షను సహించేదిలేదు
నల్లబెల్లి: ఉద్యోగుల్లో లింగ వివక్షను సహించేది లేదని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని కన్నారావుపేట, నందిగామ గ్రామాలను సోమవారం ఆమె సందర్శించి బడిబాట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందిగామ హైస్కూల్లో అంగన్వాడీ కోసం తరగతి గదిని కేటాయించాలని సూపర్వైజర్ అరుణ కలెక్టర్ను కోరగా.. ఎంఈఓ అనురాధతో కలెక్టర్ చర్చించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినుల స్టాప్ రూంలు వేర్వేరుగా ఉండడం, ఉపాధ్యాయినులకు స్టోర్ రూం కేటాయించడాన్ని గమనించారు. ఈ విధానం సరైంది కాదని ఉపాధ్యాయులపై కలెక్టర్ మండిపడ్డారు. ఉద్యోగుల్లో లింగ వివక్ష సరికాదని, ఉద్యోగులందరు ఒకే చోట సోదరభావంతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కన్నారావుపేట ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హెచ్ఎం యాదగిరిని ఆదేశించారు. కన్నారావుపేట, నందిగామ గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు.
రేషన్షాపుల్లో రద్దీ ఉన్నచోట టోకెన్ సిస్టమ్..
న్యూశాయంపేట: రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి 3 నెలల రేషన్ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నక్రమంలో రద్దీ ఉన్న చోట్ల టోకెన్ సిస్టమ్ అమలు చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సివిల్ సప్లయీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడంతో హమాలీ, ట్రాన్స్పోర్ట్, సర్వర్జామ్ మెనేజ్మెంట్ సమస్యలు ఉత్పన్నం కావడంతో అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎండ ఉన్న చోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని తెలిపారు.
కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
కోటీ మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీఎస్ రామకృష్ణారావులతో కలిసి హైదారాబాద్ నుంచి సోమవారం బడిబాట, ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాలపై కలెక్టర్లతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాల్లో స్కూల్ యూనిఫాంలు కుట్టడం పూర్తయిందన్నారు. ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక బృందాల ద్వారా జిల్లాలోని నర్సంపేట, వరంగల్లో అనువైన ప్రాంతాల్లో పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.
రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలి
ప్రీ–రివిజన్ యాక్టివిటీస్లో భాగంగా 12,00 ఓటర్లు దాటిన పోలీంగ్ కేంద్రాలను గుర్తించి రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రధాన ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో రేషనలైజేషన్, బీఎల్ఓల నియామకం, గుర్తింపు కార్డుల జారీపై సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను రేషనలైజేషన్ చేసి పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కొత్త పోలింగ్ కేంద్రాలను సూచించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ జూన్ 20లోగా పూర్తి కావాలన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడూతూ.. వరంగల్ నియోజకవర్గంలో 795 పోలింగ్ కేంద్రాలున్నాయని అన్ని కేంద్రాల్లో బూత్లెవల్ ఆఫీసర్లు ఉన్నారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీడబ్ల్యూఓ రాజరమణి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఎం సివిల్ సప్లయీస్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, టీజీఎండీసీ పీఓ విష్ణువర్ధన్, జిల్లా మైనింగ్ అధికారి రవిశంకర్, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ నర్సింహమూర్తి పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
ఉపాధ్యాయులపై మండిపడ్డ కలెక్టర్
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రతి మండలంలో ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు క్రియాశీలకంగా పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మైనింగ్ శాఖ సమన్వయ సమావేశంలో మైనింగ్ లైసెన్స్ల జారీ, ఖనిజ వనరుల నిర్వహణ, మైనింగ్ లీజుల అనుమతులు అక్రమ మైనింగ్, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.