
గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఎంజీఎం: ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్ పేషంట్, ఔట్ పేషంట్, నవజాత శిశువులకు అందిస్తున్న వైద్యసేవల గదులతోపాటు ల్యాబ్లు, పలు విభాగాలను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఐపీ, ఓపీ సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు. పలువురు గర్భిణులు, బాలింతలతో మాట్లాడి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుపరచాలని, సెప్టిక్ ట్యాంక్ వేగవంతంగా శుభ్రం చేయాలన్నారు. బాలింత ప్లేట్లో భోజనాన్ని గమనించిన కలెక్టర్ మెనూ పాటించకపోవడంపై వార్డు ఇన్చార్జ్ స్టాఫ్నర్స్, ఇన్చార్జ్ డైటీషియన్, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమో జారీ చేయాలని ఆర్ఎంఓను ఆదేశించారు. అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ను ఆస్పత్రి బయటికి మార్చాలని, ఆస్పత్రి ఇరువైపులా వెంటనే సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓలు డాక్టర్ మురళి, డాక్టర్ రమేష్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ స్వరూప, డాక్టర్ సృజన, కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
సీకేఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ