
ముగిసిన కబడ్డీ, రెజ్లింగ్ శిక్షణ శిబిరాలు
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల అధికారి టీవీఎల్ సత్యవాణి ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి నిర్వహించిన కబడ్డీ, రెజ్లింగ్ శిక్షణ శిబిరాలు సోమవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, ప్రొఫెసర్ ఇన్ ఫిజికల్ ఎడ్యూకేషన్ ఎస్సార్ యూనివర్సిటీ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్గౌడ్ పాల్గొని ప్రతి రోజు శిక్షణలో పాల్గొన్న క్రీడాకారులకు మెడల్స్, అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట ప్రాంతంలో మినీ స్టేడియం అభివృద్ధి చేయాలన్న కృషితో ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్న డీవైఎస్ఓ సత్యవాణికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థానం పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చెన్నబోయిన రామదాసు, రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుండేటి రవీందర్గౌడ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఈసాల లక్ష్మయ్య, జిల్లా ప్రైవేట్ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం బాధ్యులు నాడెం సంతోష్, పరికి ప్రశాంత్, వజ్జ రాజేష్, ఉరుసుల శేఖర్, కుంట విజేందర్ పాల్గొన్నారు.