వర్షాకాలంలో (జూన్–అక్టోబర్) పండించే పంటల సాగు కోసం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల, పురుగుల మందులు, మార్కెటింగ్ వంటి అంశాలపై హనుమకొండ జిల్లా వ్యవసాయశాఖ యాక్షన్ప్లాన్ సిద్ధం చేసింది. ఈవానాకాలంలో 2,31,320 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని అంచనా వేసిన అధికారులు.. 1,46,800 ఎకరాల్లో వరి సాగు కోసం 36,700 క్వింటాళ్లు, 5.400 ఎకరాల్లో మొక్కజొన్న సాగుకోసం 432 క్వింటాళ్ల విత్తనాలు అవరసరమని పేర్కొన్నారు. అదేవిధంగా 78,000 ఎకరాల్లో పత్తిసాగు కోసం 1,95,000 ప్యాకెట్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
సుమారుగా 4,894 టన్నుల యూరియాతో పాటు డీఏపీ ఇతర ఎరువులను అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు. ఎరువులు ఇప్పుడే అంత అవసరం లేకపోయినా ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు రైతులు ఎగబడుతున్నారు. ఇదిలా ఉంటే ఈసారి కూడా రైతులను నాసిరకం విత్తనాలు భయపెడుతున్నాయి. ఈ సీజన్ కోసం సిద్ధం చేసిన రూ.78.63లక్షల విలువైన నాసిరకం పత్తి విత్తనాలను మార్చి చివరి వారంలో హనుమకొండ జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంకా జిల్లాలో ఈ ముఠా సభ్యులు విక్రయిస్తున్నారన్న ప్రచారం కూడా ఆందోళనకు గురి చేస్తోంది.