
రైతులకు భూ భారతి ‘శ్రీరామరక్ష’
సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్: భూ భారతి చట్టంలో ప్రతి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని.. రైతులకు ఈ చట్టం శ్రీరామరక్ష అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఖిలా వరంగల్ మండలం ఉర్సుగుట్ట సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన మంగళవారం జరిగిన వరంగల్, ఖిలా వరంగల్ మండలాల భూ భారతి అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా చట్టంలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా, కలెక్టర్ సత్య శారద కూలంకషంగా రైతులకు వివరించారు. ఈ సందర్భంగా రైతులైన కొంగరి భాస్కరరావు, విజయ్ కుమార్, గోపాల రాధాకృష్ణ సమస్యలను మంత్రి పొంగులేటి నేరుగా అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. న్యాయమైన ప్రతీ సమస్యను అధికారులు పరిష్కరించాలని సూచించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు – భూ భారతి చట్టం అని తెలిపారు. ఈ చట్టంలో హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం అవకాశం ఉందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ. భూ భారతి చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ఆశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పేదోడి ఇంట్లో భోజనం
బీఆర్నగర్లోని తెలుపు రేషన్కార్డు కలిగిన సిరికొండ అనిల్కుమార్, సహస్ర దంపతుల ఇంట్లో కలెక్టర్ సత్యశారద, నగర మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడేతో కలిసి మంత్రులు శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ సన్నబియ్యం భోజనం చేశారు. అనంతరం దంపతులకు మంత్రి సురేఖ చేతుల మీదుగా పట్టు వస్త్రాలు అందజేసి అభినందించారు.
అవగాహన సదస్సులో
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రైతులకు భూ భారతి ‘శ్రీరామరక్ష’

రైతులకు భూ భారతి ‘శ్రీరామరక్ష’