
‘అక్రమంగా కేసు పెట్టారు.. న్యాయం చేయండి’
● రిటైర్డ్ పోలీస్ అధికారికి పోలీసుల వత్తాసు
● ఓ రైతు కుటుంబం ఆరోపణ
గీసుకొండ: తాము స్థానికంగా లేకపోయినా ఓ రిటైర్డ్ పోలీసు అధికారి ఒత్తిడి మేరకు జామాయిల్ చెట్లను కాలబెట్టారని గీసుకొండ పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని సంగెం మండలం కుంటపల్లికి చెందిన రౌతు పూర్ణచందర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తాను గీసుకొండ మండలం శాయంపేట హవేలి శివారులోని తన 5.30 ఎకరాల భూమిలో మొక్కజొన్నను సాగు చేసినట్లు.. తమ పక్కనే రిటైర్డ్ ఏసీపీ వాసం సురేందర్ భూమి ఉండగా.. అందులో గాదె చంద్రమౌళి అనే రైతు జామాయిల్ సాగు చేసినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తన మొక్కజొన్న చేనుతోపాటు సురేందర్కు చెందిన కొన్ని జామాయిల్ చెట్లు కాలిపోయాయని.. ఈఘటన జరిగిన రోజు తాను కేరళ వెళ్లగా.. చంద్రమౌళి ద్వారా సురేందర్ గత నెల 25న తనపై ఫిర్యాదు చేయించి స్థానిక పోలీసుల సహకారంతో కేసు నమోదు చేయించారన్నారు. తన మొక్కజొన్న చేనును కాలబెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులు అవుతున్నా.. కేసు నమోదు చేయడం లేదని పూర్ణచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈవిషయమై గీసుకొండ సీఐ మహేందర్ను వివరణ కోరగా.. మొక్కజొన్న చేనుతో పాటు జామాయిల్ తోట కాలిపోయిన విషయమై ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయగా.. రైతు పూర్ణచందర్పై కేసు నమోదు చేశామని, అతడి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.