
కాల్సెంటర్ ఆకస్మిక తనిఖీ
న్యూశాయంపేట: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కాల్సెంటర్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న కాల్సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి టోల్ఫ్రీ నంబర్కు రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఈసందర్భంగా ఫిర్యాదు రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఏయే సమస్యలపై రైతులు ఫిర్యాదు చేశారని ఆరా తీశారు. పరిష్కార వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కాల్సెంటర్కు గత నెల 21 నుంచి ఆదివారం వరకు మొత్తం 20 ఫిర్యాదులు రాగా.. పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించినట్లు కాల్సెంటర్ సిబ్బంది కలెక్టర్కు వివరించారు. ఈసందర్భంగా కాల్సెంటర్కు ఫిర్యాదు చేసి రిజిస్టర్లో నమోదై ఉన్న చెన్నారావుపేట మండలం సూరిపల్లి రైతు చంద్రశేఖర్తో, పర్వతగిరి మండల రైతు మధుతో కలెక్టర్ నేరుగా ఫోన్లో మాట్లాడారు. సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. పరిష్కారమవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు టోల్ఫ్రీ నంబర్ 180042 53424ను వినియోగించుకోవాలని, ధాన్యం కొనుగోలు, సేకరణ, రవాణా, మద్దతు ధర తదితర సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.