ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలను అమ్మడం వల్ల దానిపై ఉన్న నిర్దిష్ట ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వీటిని కొనుగోలు చేస్తే కేవలం రూ.600 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ఇక్కడ 70 శాతం పాఠశాలలు ఐదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడం లేదు. వివిధ ప్రైవేటు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాలనే తీసుకోవాలని సూచిస్తూ.. వాటికి ఎడాపెడా ధరలు నిర్ణయించి బహిరంగంగా విక్రయించడం గమనార్హం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు అసలు పాఠ్యపుస్తకాలు, సిలబస్ను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు సిలబస్ రూపొందించి ప్రత్యేకంగా పుస్తకాలను విక్రయించడం కొసమెరుపు. వీటిని కొన్ని పాఠశాలలు అక్కడే డంప్ చేసి అమ్ముతుండగా.. మరికొన్ని పాఠశాలలు సమీపంలోని బుక్ సెంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. అధిక ఫీజులు ఒక ఎత్తయితే.. యూనిఫాంలు, టై, బెల్టులు కొనడం మరో ఎత్తుగా మారింది. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంల చొప్పు న రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. టై, బెల్టులు, ఇతర నోట్ పుస్తకాలు కూడా చాలా పాఠశాలల్లోనే విక్రయించడం కొసమెరుపు.


