
పవర్.. ఫుల్
జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో లక్ష్యానికి మించి ఉత్పత్తి
ఆత్మకూర్: జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది 610 మి.యూ. లక్ష్యానికిగాను అక్టోబర్ 22వ తేదీ నాటికి 882 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించి ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా చేపట్టి రికార్డు సృష్టించారు. 2022–23లో నవంబర్ చివరి నాటికి 640 మిలియన్ యూనిట్ల లక్ష్యానికిగాను 876 మి.యూ.గా నమోదైంది. ఈ ఏడాది విద్యుదుత్పత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలకే విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు వరద చేరుతుండటంతో అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.
వరదపైనే ఆధారం..
ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండిన తర్వాత వచ్చే వరద జూరాల జలాశయానికి చేరుతుంది. వరద చేరితేనే ఇక్కడ విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉంది. ఈ ఏడాది ముందస్తుగా జలాశయానికి వరద చేరడంతో విద్యుదుత్పత్తి ప్రారంభమై నిరంతరాయంగా కొనసాగుతోంది.
మొరాయించిన మూడో యూనిట్..
జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తగా చైనాకు చెందిన సాంకేతిక నిపుణులు రెండేళ్లుగా మరమ్మతు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో బాగు కావడంతో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది.
● జూరాల దిగువ జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ నుంచి రోజుకు 40 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. 40 మెగావాట్ల ఉత్పత్తి 9,600 యూనిట్లకు సమానం. ఒక మిలియన్ యూనిట్ విద్యుదుత్పత్తికిగాను 0.78 టీఎంసీల నీటిని వినియోగిస్తారు.
● ఈ ఏడాది దిగువ జల విద్యుత్ కేంద్రంలో 290 మి.యూ. లక్ష్యానికిగాను ఈ ఏడాది 447 మి.యూ.. ఎగువ జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల నుంచి 320 మి.యూ. లక్ష్యానికిగాను 435 మి.యూ. ఉత్పత్తి చేపట్టారు. 2014–15 నుంచి 2024–25 వరకు ఎగువన 3,039 మి.యూ., దిగువన 2,531 మి.యూ., మొత్తం 5,570 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది.
610 మిలియన్ యూనిట్లకుగాను..
882 మి.యూనిట్లకు మించి...
ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికం
2022–23లో
876 మిలియన్ యూనిట్లు