
దొడ్డురకం మాకొద్దు..!?
●
సేకరణకు విముఖత
చూపుతున్న మిల్లర్లు
● సన్నాల కోసం అధికారుల వద్ద పైరవీలు
● ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యంపై రైతుల ఆందోళనలు
● జిల్లాలో 10 వేల మె.ట. పైగానే ధాన్యం కేంద్రాల్లోనే..
హమాలీల కొరతతోనే
ఇబ్బందులు..
హమాలీల కొరతతో మిల్లులు, గోదాముల వద్ద లారీల్లోని వరి ధాన్యం త్వరగా అన్లోడ్ కావడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని కేంద్రాల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – జగన్మోహన్, డీఎం,
పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్, వనపర్తి
వనపర్తి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. జిల్లావ్యాప్తంగా కొన్ని మిల్లులకే ధాన్యం కేటాయించే అవకాశం ఉండటం.. వారు కూడా సన్నరకం ధాన్యం కేటాయించాలంటూ అధికారుల వద్ద పైరవీలు సాగిస్తున్నారు. ఇటీవల గోపాల్పేట మండలం బుద్దారం, వీపనగండ్ల మండలం గోవర్ధనగిరిలో తాలు, తేమ శాతం, లారీల కొరత తదితర కారణాలు చూపిస్తూ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. హామాలీల కొరతతో ధాన్యం తరలించిన లారీలు మిల్లులు, గోదాంల వద్ద నిలిచిపోవడంతో కేంద్రాల్లో ధాన్యం నిల్వలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత నెల 29న 7,493.540 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉండగా.. శనివారం వరకు అది 10,139 మె.ట.లకు చేరినట్లు అధికారుల లెక్కలతో స్పష్టమవుతోంది.
బాయిల్డ్ రైస్మిల్లర్లు సైతం..
యాసంగి సీజన్లో వరి ధాన్యం ఎక్కువగా బాయిల్డ్ మిల్లులకు కేటాయిస్తారు. ఇందుకు కారణం బాయిల్డ్ మిల్లులో ధాన్యం మర ఆడిస్తే నూక శాతం తక్కువగా వస్తుంది. కానీ.. మార్కెట్లో దొడ్డు రకాలకు డిమాండ్ లేదనే కారణంతో ఆ మిల్లర్లు సైతం తమకు కూడా సన్న రకాలే కేటాయించాలంటూ అధికారులపై వత్తిడి తీసుకొస్తుండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై అధికారులు, మిల్లర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రతి మిల్లుకు 60:40 శాతంలో సన్నాలు, దొడ్డు రకం ధాన్యం కేటాయింపులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఎదుట సరేనంటూ తల ఊపిన మిల్లర్లు.. అధికారుల వద్ద వారికున్న చనువు, ఇతర బహుమతులను ఎరజూపి సన్నరకం ధాన్యం కేటాయింపునకు వత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో అధికసంఖ్యలో రైస్మిల్లులు ఉన్నా.. 85 శాతం మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు ఇవ్వకపోవడం, మిల్లుల్లో కనీస ధాన్యపు నిల్వలు లేకపోవడంతో కలెక్టర్ వాటిని బ్లాక్ లిస్టులో ఉంచి ధాన్యం కేటాయింపులు నిలిపివేశారు. దీంతో మిగిలిన మిల్లులకు మాత్రమే అధికారులు ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు. జిల్లా యాసంగి వరి ధాన్యం కొనుగోలు లక్ష్యం 3.40 లక్షల మెట్రిక్ టన్నులుగా అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 71 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా అందులో 50 శాతం దొడ్డురకం ఉంది. ఈ ధాన్యాన్ని మిల్లల్లు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చకపోవడంతో కేవలం నాలుగు వేల మె.ట. మాత్రమే మిల్లర్లకు కేటాయించి మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వ గోదాములలో నిల్వ చేశారు. తాజాగా వచ్చిన నిబంధనల మేరకు ప్రతి మిల్లరు దొడ్డురకాలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది.
3.40 లక్షల మె.ట. లక్ష్యం..

దొడ్డురకం మాకొద్దు..!?

దొడ్డురకం మాకొద్దు..!?