ఏడాదికి రూ.340 వరకు యూజర్ చార్జీలు
ఏడాదికి రూ.340 వరకు వసూలు
ప్రజలపై ఇదో రకం బాదుడు
జిల్లాలో 4.15 లక్షల ఇళ్లు
ఇందులో 2.10 లక్షల తాగునీటి కుళాయిలు
జీఓ విడుదలైంది..
విజయనగరం ఫోర్ట్:
తాగునీటికి కూడా చంద్రబాబు ప్రభుత్వం యూజర్ చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవు తుంది. తాగునీటి పథకాల నిర్వాహణ పేరుతో ప్రజలపై భారం మోపేందుకు టీడీపీ సర్కార్ చూస్తుంది. దీని వల్ల జిల్లా ప్రజలపై కోట్లాది రుపాయిల భారం పడనుంది. చంద్రబాబు నేతృత్వంలో ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు జీవించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం తాగునీటికి యూజర్ చార్జీలు వసూలు చేసేందుకు సన్నద్ధం కావడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఒక్క గ్రామానికి తాగునీరు అందించే రక్షితనీటి పథకాలు 851 ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ గ్రామాలకు తాగునీరు అందించే రక్షిత తాగునీటి పథకాలు 30 ఉన్నాయి. జిల్లాలో ఇళ్లు 4.15 లక్షలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జిల్లాలో 2.10 లక్షల తాగునీటి కుళాయిలు ఉన్నాయి. వీటిలో పబ్లిక్ కుళాయిలతో పాటు ఇంటింటి కుళాయిలు కూడా ఉన్నాయి.
జిల్లాలో అత్యధిక శాతం మంది ప్రజలు రక్షిత మంచినీటి పథకాలు ద్వారా సరఫరా అయ్యే కుళాయి నీటినే తాగుతున్నారు. రోజు విడిచి రోజు కుళాయి వచ్చే ప్రాంతాల్లో ప్రజలు తాగునీటిని రెండు రోజులకు సరిపడ నిల్వ చేసుకుంటారు. ఏదైనా సమస్య వచ్చి తాగునీటి కుళాయిలు ద్వారా తాగునీరు రాకపోతే ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. వాటర్ ప్లాంట్లు వద్ద నీరు కొనుగోలు చేసి తాగేవారు చాలా తక్కువ. 95 శాతం మంది వరకు కుళా యి నీటినే తాగుతున్నారు. పట్టణాలతో పాటు, పల్లెల్లో కూడా తాగునీటి కుళాయిల ద్వారా వచ్చే నీటినే ప్రజలు ఎక్కువగా తాగుతున్నారు.
జిల్లాలో ప్రజలు తాగే నీటికి కూడా చంద్రబాబు సర్కార్ యూజర్ చార్జీలు వసూలు చేయనుంది. ఏడాదికి ఒక్కో ఇంటికి యూజర్ చార్జీలు కింద రూ.340 వరకు వసూలు చేయనున్నారు. తాగునీటి పథకాల నిర్వాహణ నిమిత్తం యూజర్ చార్జీలు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం జీఓ కూడా జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కుళాయి కనెక్షన్లుకు యూజర్ చార్జీలు వసూలు చేస్తే ప్రజలపై రూ.7 కోట్లకు పైగా భారం పడనుంది. జిల్లాలో సగం మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. శతశాతం కుళాయి కనెక్షన్లు ఇవ్వకుండా యూజర్ చార్జీలు ఏవిధంగా వసూలు చేస్తారనే వాదన కూడా వినిపిస్తుంది.
తాగునీటి నిమిత్తం యూజర్ చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. తదుపరి విధి విధానాలు అయితే ఇంకా రాలేదు. జలజీవన్ మిషన్ 2.0 లో భాగంగా ప్రస్తుతం ఉన్న ఇళ్లకు యూజర్ చార్జీలు వసూలు చేయాలని చెబితే ముందుకు వెళతాం.
– ఎస్.కవిత, ఎస్.ఈ, ఆర్డబ్ల్యూఎస్


