సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, అధికారులు
విజయనగరం గంటస్తంభం: 22ఏ భూముల వివ రాల పరిశీలన, రెవెన్యూ సేవలు, ప్రజా ఫిర్యాదు ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సీసీఎల్ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ సర్వే, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, 22ఏ భూముల వివరాల నవీకరణ, రెవెన్యూ సేవలు, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ భూ రీసర్వే పెండింగ్ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో సిహెచ్.సత్తిబా బు, ఆర్డీఓ సుధాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛతే లక్ష్యంగా.. కార్యాచరణ
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించనున్న స్వచ్ఛత హి సేవా–2026 కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యర్థాల విభజనపై అవగాహన కల్పించడం, అపరిశుభ్ర ప్రాంతాల సుందరీకరణ, బస్టాండ్లు, మార్కెట్లు, ఆస్పత్రులు, నీటి వనరులు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇంటింటా ప్రచారం, నాలుగు రకాలుగా వ్యర్థాల విభజన, ఇంటి వద్దే సేంద్రియ ఎరువు తయారీ, గుడ్డ సంచుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వినాయక నిమజ్జనం అనంతరం ఘాట్ల పరిశుభ్రత, వ్యర్థాల నుంచి సంపద కార్యక్రమాలు, పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాలు పంపిణీ చేపట్టాలని తెలిపారు. అక్టోబరు 1న ఏక్ దిన్..ఏక్ ఘంటా..ఏక్ సాత్లో భాగంగా సామూహిక శ్రమదానం, 2న ప్రత్యేక గ్రామసభలు, పట్టణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాలపై ముందస్తు ప్రణాళికతో పాటు పూర్తిస్థాయి డాక్యుమెంటేషన్ చేయాలని కలెక్టర్ సూచించారు.


