విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ 2026–27 సీజన్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లును ముందుగానే పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ పక్రియను చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై బుధవారం నిర్వహించిన జిల్లా కొనుగోలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో 2,05,893 ఎకరాల్లో వరి సాగు కా గా, సుమారు 5.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా.. ఎల్నినో ప్రభావంతో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నందున ప్రాధమికంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అంచనా వేసినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధర గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.2,461, సాధారణ రకం ధాన్యం క్వింటా రూ. 2441లుగా నిర్ణయించారన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు కనీస మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలు, కొనుగోలు కేంద్రాల్లో కల్పించే సౌకర్యాలపై గ్రామసభలు, పోస్టర్లు కరపత్రాలు, మైక్ ప్రచారం ద్వారా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ పంట నమోదు లో కేవలం సాగు చేసిన వ్యవసాయ భూములు, రైతులు సాగు చేసిన పంట రకాలను మాత్రమే నమోదు చేయాలన్నారు. రైస్ మిల్లుల తనిఖీలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు మిల్లులను అనుసంధానం చేయాలన్నారు. రైస్ మిల్లర్లు గడువులో గా బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ డీఎం బి.శాంతి, డీఎస్ఓ మురళీనాధ్, ఆర్డీఓ సుధాసాగర్, సుధారాణి, రామ్మోహన్రావు, మార్కెటింగ్ ఏడీ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


