గోనె సంచిలో మూటకట్టి..
● కుదిపి గ్రామ సమీపంలో వివాహిత మృతదేహాన్ని పడేసిన నిందితుడు
● కన్నీరుపెడుతున్న చిన్నారులు
పూసపాటిరేగ: వినాయక చవితి పండగ వేళ పూసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామంలో వివాహిత హత్య కలకలం రేపింది. పూసపాటిరేగ పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం... సోమవారం మధ్యాహ్నం నడిపల్లికి చెందిన లంకలపల్లి బంగారుబాబు పిలుపుమేరకు ఆయన ఇంటికి ఆదే గ్రామానికి చెందిన శీలా రమా(34) వెళ్లింది. వారిద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలపై వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడై బంగారుబాబు దిండుతో రమాను ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. సాక్ష్యాలు మాయం చేయడానికి రమా మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి బండిపై 20 కిలోమీటర్ల దూరంగా తీసుకెళ్లి కుదిపి, సారిపల్లి గ్రామాల మధ్య తోటల్లో పడేశాడు. భార్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన భర్త శీల అప్పారావు పూసపాటిరేగ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వివాహిత హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చి పలు కోణాల్లో విచారణ జరిపారు. నిందితుడిని పూసపాటిరేగ మండలం పోరాం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. భోగాపురం రూరల్ సీఐ నిమ్మకాయల శ్రీనివాసరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వి.నర్సింహరావు, పూసపాటిరేగ ఎస్ఐ వి.అరుణ్కిరణ్ పరిశీలించారు.
పాపం చిన్నారులు...
మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లి హత్యకు గురైందన్న విషయం తెలుసుకుని కన్నీరుకార్చారు. అమ్మ కావాలి అంటూ ఇద్దరు చిన్నారులు గుక్కపెట్టి ఏడవడం గ్రామస్తులను కన్నీరుపెట్టించింది.


