● పోటాపోటీగా మంటపాల ఏర్పాటు
● వినాయకుడి చాటున ‘వార్డు’ రాజకీయం
విజయనగరం అర్బన్: వినాయక చవితి వేళ.. వియయనగరం పట్టణంలో మంటపాల సాక్షిగా ఎన్నికల వేడి సెగపుట్టిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు, తమ ఉనికిని చాటుకునేందుకు చవితి మండలాల ఏర్పాటును ఒక అవకాశంగా మలుచుకుంటున్నారు. పోటాపోటీగా మంటపాల ఏర్పాటుకు సహకారం అందించారు. దీంతో గతేడాదిలో పోలిస్తే ఈ ఏడాది పట్టణంలో వినాయక చవితి మంటపాల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా పోలీసుల లెక్కల ప్రకారం నగరంలో 530 మంటపాలు వెలిశాయి. గతేడాది ఈ సంఖ్య కేవలం 300 లోపు ఉండేది. ఒకప్పుడు ప్రధాన కూడళ్లు, కాలనీలకే పరిమితమైన మంటపాలు... ఇప్పుడు ప్రతి సందులోనూ దర్శనమిస్తున్నాయి. ఆశావహులు చవితి వేడుకల సాక్షిగా తమ అనుచరగణాన్ని పెంచుకునేందుకు పాకులాడుతుండడాన్ని చూసిన జనం ముక్కునవేలేసుకుంటున్నారు.
మంటపాల సంఖ్య పెరగడంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్లు, కూడళ్లు, కాలనీ వీధుల్లో మంటపాల ఏర్పాటుతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు స్థలం తగ్గిపోగా, మరికొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు తప్పనిసరి అవుతున్నాయి. భక్తి, సామాజిక ఐక్యతకు వేదిక కావాల్సిన చవితి ఉత్సవాలను రాజకీయ ప్రచార వేదికలుగా పలువురు ఉపయోగించుకోవడం విమర్శలకు తావిస్తోంది.


