కొత్తవలస: వినాయక చవితి పర్వదినాన జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుంటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆనందగా గడపాల్సిన వేళ యువకుడిని మృత్యువు కాటేసింది. అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా,.. మరో యువకుడు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో పోరాడుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామాజు జిల్లా అరకు సమీపంలోని అనంతగిరి ప్రాంతానికి చెందిన బిడ్డక చరణ్ (21), బిడ్డక రాజు ఇంటి వద్ద వినాయక పూజలు ముగించుకొని ద్విచక్రవాహనంపై విశాఖపట్నం బయలుదేరారు. కొత్తవలస మండలం జిందాల్ ఫ్యాక్టరీకి సమీపంలోని చెరువు వద్ద మరమ్మతులతో రోడ్డుపై నిలిపివేసిన బొలోరా వాహనాన్ని బైక్తో ఢీకొట్టారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. అక్కడకు చేరుకునే సరికి తలకు తీవ్రగాయాలు కావడంతో చరణ్ (21) మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజు కొన ఊపిరితో వైద్యసేవలు పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.
విశాఖపట్నం–అరకు జాతీయ
రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన
ద్విచక్రవాహనం
ఒకరు మృతి, కొన ఊపిరితో
మరొకరు..


