జగనన్న కాలనీలపై వివక్ష తగదు
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్
రేగిడి: పల్లెల్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు మూడుసెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఒక్క లబ్ధిదారుకు కూడా సెంటు భూమి ఇవ్వలేదని, మరోవైపు జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ విమర్శించారు. నాయిరాలవలస గ్రామంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం జగనన్న కాలనీలను పూర్తిగా విస్మరించిందన్నారు. జగనన్న కాలనీలను తాము నిర్మించినట్టు చంద్రబాబు డబ్బాకొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. జగనన్న కాలనీలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంగా మార్పుచేసి ఇళ్ల నిర్మాణాలకు ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసంచేస్తున్న తీరును గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధిచెబుతారన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు టంకాల అచ్చెన్నాయుడు, వంగర ఎంపీపీ సురేష్ముఖర్జీ, రేగిడి, వంగర మండల పార్టీల కన్వీనర్లు వావిలపల్లి జగన్మోహనరావు, కరణం సుదర్శనరావు, వన్నలి సర్పంచ్ గార రమణ, పాలవలస ధవలేశ్వరరావు పాల్గొన్నారు.


