ఉయ్యాలో.. ఉయ్యాలా..
● నేత్రపర్వంగా పైడితల్లి ఉయ్యాల కంబాల మహోత్సవం
● అమ్మదర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయనగరం టౌన్: భక్త కోటికి సిరులిచ్చే చిన్నారి పైడిమాంబ ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి వైభవంగా సాగింది. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. చదురుగుడి ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాల చుట్టూ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మూడుసార్లు ప్రదక్షణ చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఊయలలో ఆశీనులై అమ్మవారి ఉయ్యాలకంబాల ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం సిరిమానుతో పాటు తెచ్చిన రాటకు మూడుసార్లు గొడ్డలి ఆనించి ఊయలను తీసివేశారు. దీంతో అమ్మవారి జాతరకు ముగింపు పలికినట్లేనని, వనంగుడి వద్ద బుధవారం నిర్వహించే చండీహోమం పూర్ణాహుతితో జాతర ముగుస్తుందని అర్చకులు తెలిపారు. ఉత్సవం పూర్తయిన తర్వాత అమ్మవారిని మేళతాళాలతో వనంగుడికి తీసుకువెళ్లనున్నారు. అమ్మవారు వనంగుడిలోనే ఆరు నెలల పాటు భక్తులకు దర్శనమిస్తారు. కార్యక్రమానికి ముందు ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష మాట్లాడుతూ సెప్టెంబర్ 9న పందిరిరాటతో ప్రారంభమైన నెలరోజుల జాతర మహోత్సవాలు ఈ నెల 22న వనంగుడిలో నిర్వహించే దీక్షా విరమణలతో పూర్తవుతాయని వివరించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వై.వి.రమణి, సూపర్వైజర్లు రామారావు, పెనుమత్స శ్రీనివాసరాజు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
పోటెత్తిన భక్తులు
సిరిమానోత్సవం రోజు రాలేని భక్తులు ఉయ్యాల కంబాల ఉత్సవం రోజు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఘటాలు సమర్పించారు. మొక్కుబడులు చెల్లించారు. సుమారు 30వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అఽధికారులు తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు, దేవదాయాశాఖ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, పులిహోర, మజ్జిగ, ప్రసాదం ఉచితంగా పంపిణీ చేశారు.
నేడు దీక్షాపరుల ర్యాలీ
బుధవారం వేకువజామున 6 గంటల నుంచి ఇరుముడి కట్టిన పైడితల్లి అమ్మవారి దీక్షధారులు అమ్మవారి నామస్మరణతో చదురుగుడి నుంచి ఇరుముడినెత్తుకుని అమ్మవారి ఉత్సవ విగ్రహంతో వనంగుడికి బయలుదేరుతారు. వనంగుడి వద్ద నిర్వహంచే చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో దీక్షధారులు పాల్గొంటారు. పూర్ణాహుతి పూర్తయిన తర్వాత దీక్ష విరమణలు చేస్తారు. దీంతో ఉత్సవం పూర్తవుతుంది.
ఉయ్యాలో.. ఉయ్యాలా..
ఉయ్యాలో.. ఉయ్యాలా..
ఉయ్యాలో.. ఉయ్యాలా..


