
హెచ్ఐవీ రోగులపై వివక్ష..!
విజయనగరం ఫోర్ట్:
వీరిద్దరికే కాదు అనేక మంది హెచ్ఐవీ రోగులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో హెచ్ఐవీ బాధితులకు వైద్యసేవలు అందడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష చూపరాదని, ఆప్యాయత చూపాలంటూ ప్రజాప్రతినిధులు దగ్గర నుంచి అధికారుల వరకు ఉపన్యాసాలు చెబుతున్నా.. వైద్యులే సేవలందించేందుకు ససేమిరా అంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏదైనా అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయిస్తే వైద్యసేవలు ఆందించేందుకు వైద్యులు, సిబ్బంది ఇష్టపడడం లేదని హెచ్ఐవీ బాధితులే వాపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, గైనిక్ సమస్య ఉన్న మహిళలకు, కడుపునొప్పి, పేగు వరపు, హెర్నియా, హైడ్రోసిల్, ఈఎన్టీ సర్జరీ, ఎముకలు, నరాల సంబంధిత శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఎస్.కోట, రాజాం, గజపతినగరం, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రులు, బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, భోగాపురం సీహెచ్సీలు, ఘోషా ఆస్పత్రిలో హెచ్ఐవీ బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సలు, చికిత్స అందించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
● ప్రైవేటు ఆస్పత్రులే దిక్కు...
జిల్లాలో 6,670 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్టు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. వీరిలో పురుషులు 2,755 మంది, మహిళలు 3,646 మంది, పిల్లలు 269 మంది వరకు ఉన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందక పలువురు హెచ్ఐవీ బాధితులు ఆపదవేళ శస్త్రచికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హైడ్రోసిల్, ఫైల్స్ శస్త్రచికిత్సకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు, గైనిక్ సర్జరీలకు రూ.60 వేల నుంచి రూ. 70 వేలు వరకు వసూలు చేస్తున్నారు. హెర్నియా, కడుపు నొప్పి వంటి శస్త్రచికిత్సలకు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు.
‘విజయనగరం పట్టణానికి చెందిన ఓ హెచ్ఐవీ బాధితురాలికి గైనిక్ సమస్య రావడంతో ఆమె ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించింది. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు గుర్తించారు. హెచ్ఐవీ ఉండడంతో శస్త్రచికిత్స చేయలేమని చెప్పేశారు. చేసేదిలేక విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 60 వేలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకుంది.’
‘చీపురపల్లి ప్రాంతానికి చెందిన ఓ హెచ్ఐవీ రోగికి కడుపునొప్పి రావడంతో విజయనగరంలో ఉన్న ప్రభుతాస్పత్రిలోని వైద్యుడిని ఆశ్రయించారు. వైద్య పరీక్షల్లో హెచ్ఐవీ ఉందని తేలడంతో వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేయలేదు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ.50 వేలు ఖర్చుచేసి శస్త్రచికిత్స చేసుకున్నారు.’
ఆదేశాలిచ్చాం..
హెచ్ఐవీ రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ కె.రాణి, జిల్లా ఎయిడ్స్
నియంత్రణ అధికారి
ప్రభుత్వాస్పత్రుల్లో హెచ్ఐవీ రోగులకు జరగని శస్త్రచికిత్సలు
ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది రుపాయలు వెచ్చించి వైద్యం పొందుతున్న హెచ్ఐవీ రోగులు
జిల్లాలో 6,610 మంది హెచ్ఐవీ
బాధితులు
వీరిలో మహిళలే 3,646 మంది