
సెప్టెంబర్ 13, 14 తేదీల్లో జేవీవీ రాష్ట్ర మహాసభలు
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించే 18వ జనవిజ్ఞాన వేధిక మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కె.త్రిమూర్తులు పిలుపునిచ్చారు. స్థానిక ఏపీఎన్జీవో హోమ్లో ఆదివారం జరిగిన ఆహ్వాన సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు ప్రజలు హేతుబద్దంగా ఆలోచించి జీవించాలని గత 37 సంవత్సరాలుగా జనవిజ్ఞాన వేదిక అవిరళ కృషి జరుపుతున్నదని పేర్కొన్నారు. శాస్త్రవేత్త
లు, వైద్యులు, ఉద్యోగులు ఉపాధ్యాయులు, విద్యార్ధులు, యువకులు, మహిళలు మధ్యతరగతి మేధావులు, వృత్తి నిపుణులు దాదాపు 30 వేలకు పైగా సభ్యులున్న అతి పెద్ద సైన్స్ ప్రచార సంస్థ జనవిజ్ఞాన వేదిక అని కొనియాడారు. జేవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు సంభవించినా సైన్స్కు సంబంధించి ఏ అంశం ముందుకొచ్చి చర్చనీయాంశంగా మారినా జేవీవీ కార్యకర్తలు ముందుండి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘానికి చైర్మన్గా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణను సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రమణప్రభాత్, సాహితీ స్రవంతీ రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి పాల్గొన్నారు.