
అలకల్లోలం..!
● వేటకు అల్పపీడనం దెబ్బ
● ప్రతికూల వాతావరణంతో కొనసాగని చేపల వేట
● ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులు
ప్రతికూల వాతావరణంతో పతివాడబర్రిపేటలో ఉధృతంగా వస్తున్న కెరటాలు
పూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న గంగపుత్రులకు ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన రెండు నెలలుగా వేట నిషేధం కారణంగా సముద్రంలో వేట నిలిపివేశారు. తీరా వేట ప్రారంభించిన నాటి నుంచి వాతావరణంలో మార్పులతో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడం తదితర కారణాలతో కొంత సమయం వేట సాగలేదు. తాజాగా గత మూడురోజులుగా అల్పపీడనం కారణంగా కెరటాలు ఉధృతిగా రావడంతో చేపల వేటకు వెళ్లినా చేపలు వలకు చిక్కని పరిస్థితి నెలకొందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో గాలులు వీయడం, అలలు ఎగిసి పడుతుండడంతో వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 27 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో 21 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వేటపై ప్రత్యక్షంగా 6 వేల మంది, పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. సంప్రదాయ బోట్లు, ఇంజిన్బోట్లు రెండు మండలాల్లో 1120 వరకు ఉన్నాయి. వాటిలో 885 బోట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ ఏడాది వేట నిషేధం తరువాత వేట ప్రారంభించినప్పటి నుంచి చేపలు వలకు చిక్కడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. నిషేధ సమయంలో కుటుంబాలు ఎలాగో నెట్టుకొచ్చినా మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అలల ఉధృతి ఎక్కువై బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. వేట లేకపోవడంతో వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. వేట నిషేధ సమయంలో భృతి మంజూరుకు నిబంధనల పేరిట చాలామంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా నిలిపివేశారు. గత ప్రభుత్వంలో వేట చేసిన ప్రతి మత్స్యకారుడికి మత్స్యకార భరోసా మంజూరైంది. కానీ నేడు మత్స్యకారుల పరిస్థితి అయోమయంగా మారింది. గత ఏడాది కూడా మత్స్యకార భరోసా ఊసెత్తని సర్కారు నిబంధనల పేరిట ఈ ఏడాది చాలా మందికి కోత విధించింది. ఏడాదిలో సగం రోజులు ప్రకృతి వైపరీత్యాలు, మరి కొన్ని రోజులు తుఫాన్ హెచ్చరికలు, ప్రతి కూలవాతావరణంతో వేట సాగక ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకార జీవనవిధానంలో మార్పులకు సర్కారు ప్రత్యామ్నాయం ఆలోచించి వేట లేని సమయంలో తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.
అరకొరగా మత్స్యసంపద
వేట నిషేధసమయం తరువాత వేటకు వెళ్లినా చేపలు వలకు చిక్కడం లేదు. ప్రతి ఏడాది నిషేధం తరువాత చేపల వేట చేస్తే మత్స్య సంపద సమృద్ధిగా దొరికేది. కానీ ఈ ఏడాది నిషేధం తరువాత చేపల వేట సాగడం లేదు. వేటకు వెళ్లినా డీజిల్ఖర్చు కూడా రాని పరిస్థితి నెలకొంది. అల్పపీడనం కారణంగా మూడురోజులుగా వేట సాగలేదు.
– సూరాడ కొర్లయ్య, పతివాడబర్రిపేట
ప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు
సముద్రంలో అల్పపీడనం ప్రభావంతో ప్రతికూలవాతావరణం నెలకొని అలల ఉధృతి పెరిగింది. వాతావరణంలో మార్పుల కారణంగా వేట చేయలేని పరిస్థితి. వేట సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. వేటలేని సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించి ఆదుకోవాలి.
– ఆకుల కాశీలు, పతివాడ బర్రిపేట

అలకల్లోలం..!

అలకల్లోలం..!

అలకల్లోలం..!

అలకల్లోలం..!