● సర్వే శాఖలో ఖాళీలపై సందిగ్ధత?
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో కూటమి నేతల ఒత్తిళ్లు మితిమీరిపోయాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం అదే స్థాయిలో ఎదురొడ్డి నిబంధనల మేరకు బదిలీలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో నిబంధనలను కాదని నేరుగా కౌన్సెలింగ్కు పిలవడం దుమారం రేగుతోంది.
సర్వే శాఖలో ఖాళీలను బ్లాక్ చేయాలంటూ ఒత్తిళ్లు
రెవెన్యూ శాఖలో వీఆర్వో, సర్వేయర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తొలిత ఖాళీలు, సీనియారిటీ జాబితాలను వెల్లడించలేదు. దీన్ని సర్వేయర్ల సంఘం అడ్డుకుంది. బొబ్బిలికి చెందిన 6 పోస్టుల ఖాళీలలో ఒకటి మాత్రమే చూపించారు. ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాల పరిధిలో ఆయా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఖాళీలను చూపించలేదు. నియామక ర్యాంకుల ఆధారంగా కాకుండా ఇష్టారీతిన కౌన్సెలింగ్కు పిలవడంతో సర్వేయర్లు తొలిత ఆందోళనకు దిగారు. దీంతో శనివారం అర్ధరాత్రి వరకు బదిలీల ప్రక్రియ ప్రారంభం కాలేదు. జిల్లాలోని తప్పనిసరి బదిలీల్లో 348 మంది సర్వేయర్లు ఉండగా మరో 70 మంది కూడా బదిలీలను ఆశిస్తున్నారు. అయితే డిమాండ్ ఉన్న దాదాపు 30 ఖాళీలను తమకు కావాల్సిన వారికి కేటాయించాలని ఓ మంత్రి ఒక జాబితాను ఇచ్చి అధికారులపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఖాళీల జాబితాను వెల్లడించని పరిస్థితిని అధికారులు తీసుకొచ్చారు. దీన్ని సర్వేయర్ల సంఘం ససేమిరా అంటూ బదిలీల ప్రక్రియను జరగనివ్వలేదు. దీంతో సంబంధిత ఉన్నతాధికారులను జిల్లా సర్వే శాఖ సంప్రదించగా జీవో 5 ప్రకారమే బదిలీలు చేపట్టండని ఆదేశాలు వచ్చాయి. దీంతో మొత్తం ఖాళీలను ప్రదర్శించి నిబంధనల మేరకు బదిలీలు చేపట్టారు. అయితే మంత్రి ఇచ్చిన జాబితాలోని 30 ఖాళీలను కేటాయించిన వారికి ఏ క్షణమైనా మార్పు జరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు అనధికారిక మౌఖిక సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో సంబందిత 30 ఖాళీల బదిలీలపై సందిగ్ధత నెలకొంది.
సంగాంలో ఏనుగుల సంచారం
వంగర: సంగాంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. శనివారం అర్ధరాత్రి రేగిడి మండలం సరసనాపల్లి తోటల్లోంచి మడ్డువలస వంతెన కింది భాగం మీదుగా సంగాం పంట పొలాల్లోకి ప్రవే శించాయి. మొక్కజొన్న, చెరకు, వరి పంటలను నాశనం చేశాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఆదివారం రాత్రి వంగర నుంచి రాజాం వెళ్లే రోడ్డును ఆనుకొని సంగాం పంట పొలాల్లో తొమ్మిది ఏనుగులు తిష్ట వేశాయి. అటవీ శాఖ సిబ్బంది, ఎలిఫెంట్ టేకర్స్ వాటి వెంట ఉంటూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
కూటమి నేతల ఒత్తిళ్లు...!