
అక్కరకు రాని ఈఎస్ఐ
● ఎక్స్రేకు దిక్కులేదు
● అరకొరగా రక్తపరీక్షలు
● శిథిలావస్థలో భవనాలు
● జరగని ఎల్ఎఫ్టీ పరీక్షలు
విజయనగరం ఫోర్ట్: కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తాం. ఈఎస్ఐ డిస్పెన్సరీ, డయోగ్నొస్టిక్ సెంటర్స్లో సౌకర్యాలు కల్పిస్తాం అంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ ఆ గొప్పమాటలు అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంక్షేమం మాట దేవుడెరుగు. కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా అందని పరిస్థితి ఉంది. దీంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కార్మికులు ఏదైనా జబ్బు చేసినా, ప్రమాదం జరిగినా చికిత్స కోసం వచ్చే ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఎక్స్రేకు రేడియాగ్రాఫర్ కరువు
ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎక్స్రేకు దిక్కు లేకుండా పోయింది. సెంటర్కు ఎక్కువగా ఎముకల సంబంధిత వ్యాధులతో కార్మికులు వస్తారు. అదేవిధంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పడు గాయాలతో వస్తారు. వారికి వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. అయితే డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎక్స్రే మిషన్ ఉన్నప్పటికీ తీసే నాథుడు లేకపోవడం వల్ల కార్మికులు ప్రైవేట్ ల్యాబొరేటరీలకు కార్మికులు వెళ్లి రూ. 300 నుంచి రూ. 350 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కాన్ ఉన్నప్పటికీ రేడియాలజిస్టు లేకపోవడంతో గైనకాలజిస్టులు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నారు.
సెంటర్లో ఓపీ విభాగాలు
ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎముకల విభాగం, అప్తమాలజీ, గైనిక్, ఈఎన్టీ, పిడియాట్రిక్ ఓపీ విభాగాలు ఉన్నాయి. ఆయా ఓపీ విభాగాల్లో సేవలు పొందేందుకు కార్మిక కుటుంబసభ్యులు ప్రతి రోజు 50 నుంచి 60 మంది వరకు వస్తారు.
జాడే లేని ఎల్ఎఫ్టీ పరీక్ష
డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎల్ఎఫ్టీ (లిఫిడ్ ప్రొఫైల్ టెస్ట్) జరగడం లేదు. దీంతో కార్మికులు ఈ టెస్టు కోసం ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తూ రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చు చేస్తున్నారు.
సెంటర్ పరిధిలో 21 వేల మంది కార్మికులు
ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్ పరిధిలో 21 వేల మంది కార్మికులు ఉన్నారు. వారంతా ఏదైనా జబ్బు చేస్తే చికిత్స కోసం వస్తారు. ఓపీ సేవలు అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. ఇన్పేషేంట్ సేవలు అవసరమైన వారికి విశాఖలోని మల్కాపురంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు.
శిధిలావస్థకు చేరిన భవనాలు
ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. భవనాలన్నీ పెచ్చులు ఊడిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని కార్మికులు, సెంటర్ వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గాజులరేగ వద్ద నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ 100 పడకల ఆస్పత్రి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు.
రేడియోగ్రాఫర్ లేరు
ఎక్స్రేలు తీసే రేడియోగ్రాఫర్ వేరే ఉద్యోగం వచ్చి వెళ్లి పోయారు. దీంతో ఎక్స్రేలు తీయడం లేదు. రేడియాగ్రాఫర్ను నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సెంటర్ను ప్రైవేట్ భవనంలోకి మార్చాలని ప్రతిపాదన ఉంది. త్వరలోనే మార్చే అవకాశం ఉంది. డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సూపరింటెండెంట్,
ఈఎస్ఐ డయోగ్నొక్ సెంటర్

అక్కరకు రాని ఈఎస్ఐ

అక్కరకు రాని ఈఎస్ఐ