జిందాల్‌ రైతులకు వారంలో పరిహారం | - | Sakshi
Sakshi News home page

జిందాల్‌ రైతులకు వారంలో పరిహారం

Jun 28 2025 5:27 AM | Updated on Jun 28 2025 7:18 AM

జిందాల్‌ రైతులకు వారంలో పరిహారం

జిందాల్‌ రైతులకు వారంలో పరిహారం

విజయనగరం అర్బన్‌: జిందాల్‌ భూములకు సంబంధించి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారాన్ని వారంరోజుల్లో అందజేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. జిందాల్‌ కోసం సేకరించిన భూములపై తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ శుక్రవారం సమీక్షించారు. ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, పెండింగ్‌ బకాయిలపై ఆరా తీశారు. సుమారు 28 ఎకరాలకు సంబంధించి 15 మంది రైతులకు మాత్రమే పరిహారం పెండింగ్‌ ఉందని, వారికి వెంటనే పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు జిందాల్‌ చెల్లించాల్సిన పరిహారంపైనా చర్చించారు. పదిరోజుల్లో పెండింగ్‌ బకాయిలను రైతులకు చెల్లించాలని జిందాల్‌ యాజమన్యాన్ని కలెక్టర్‌ ఆదేశించారు.

జిందాల్‌ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌

జిందాల్‌ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ చెప్పారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిందాల్‌ భూములకు సంబంధించి కేవలం 15 మంది రైతులకు మాత్రమే బకాయి ఉందని చెప్పారు. జిందాల్‌ పరిశ్రమకు అప్పట్లోనే సుమారు 1,166 ఎకరాలను ప్రభుత్వం అప్పటించిందన్నారు. ఈ భూముల్లో 180 ఎకరాలను జిందాల్‌ యాజమాన్యమే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిందని చెప్పారు. ఇది కాకుండా మొత్తం 375 మంది రైతుల నుంచి 834 ఎకరాల అసైన్డ్‌ భూమిని, 151 ఎకరాల ప్రభుత్వ భూమిని జిందాల్‌కు కేటాయించినట్లు తెలిపారు. జిందాల్‌ కోసం ఒక్క ఎకరం భూమిని కూడా రైతుల దగ్గర సేకరించలేదని, 2013 భూసేకరణ చట్టం ఇక్కడ వర్తించదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మొత్తం 28.72 ఎకరాలకు సంబంధించి 15 మంది రైతులకు ఉన్న బకాయిని వారం రోజుల్లో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1962లో మొత్తం 20 మందికి పట్టాలు ఇవ్వగా వారిలో నలుగురు మాత్రమే ఇళ్లు కట్టుకోగా, వారికి అప్పట్లోనే పరిహారం చెల్లించినట్లు తెలిపారు. షేర్లు, ఉద్యోగ కల్పన, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు సంబంధించి జిందాల్‌ యాజమాన్యమే రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుందని దానిలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంపకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, ఎస్‌కోట తహసీల్దార్‌ డి. శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ డి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ తాడ్డి గోవింద, ఇతర అధికారులు, జిందాల్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సమీక్షించిన కలెక్టర్‌ అంబేడ్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement