
పైడితల్లికి స్వర్ణపుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి ఆలయంలో శుక్రవారం స్వర్ణ పుష్పార్చన చేశారు. వేకువజామునుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితులు సాయికిరణ్, అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
బాడంగి: ఓ కారు అదుపుతప్పి భోజనం హోటల్లోకి దూసుకు పోయిన సంఘటనలో అదృష్టవశాత్తు పెనుప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. టెక్కలి నుంచి జయపూర్ వెళ్తున్న కారు స్పీడ్ బ్రేకర్ల ములంగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ముందుటైర్లు రాయిపైకి ఎక్కి పోవడంతో స్టీరింగ్ అదుపుతప్పింది. దీంతో మండలకేంద్రంలో పోలీస్స్టేషన్ ఎదురుగా గల ఎం.చైతన్య భోజనం హోటల్లోకి కారు ఒక్కసారిగా దూసుకుపోయింది. అయితే ఆ హోటల్లో టిఫిన్ సెక్షన్ లేకపోవడంతో పాటు ఉదయం 8గంటల సమయం కావడంతో పనివారు హోటల్ లోపల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బయట ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పిందని హోటల్ సిబ్బంది భయాందోళనతో చెప్పారు.
మహిళపై కత్తిపీటతో దాడి
వేపాడ: మండలంలోని నల్లబిల్లి గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కత్తి పీటతో దాడి చేసినట్లు వల్లంపూడి పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఉడతా మణికంఠ గ్రామంలోని ఈర్లి సీతారాం (62)ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగాడు. మంచినీళ్లు ఇవ్వడానికి ఆమె గదిలోకి వెళ్లగా మెడలోని బంగారం తాడు తుంచి వేయడానికి మణికంఠ ప్రయత్నం చేశాడు. దీంతో సీతారాం కేకలు వేయగా పరిసరాల్లో ఉన్న వ్యక్తులు వచ్చేసరికి ఇంట్లో ఉన్న కత్తిపీటతో సీతారాం మెడపై మణికంఠ దాడి చేసి గాయపర్చాడు. స్థానికులు వెంటనే 108కు సమాచారమిచ్చి కోటపాడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవలకు విశాఖ కేజీహెచ్కు తీసుకువెళ్లారు. సమాచారం మేరకు ఎస్.కోట రూరల్ ఎస్సై ఎల్.అప్పలనాయుడు గ్రామానికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.

పైడితల్లికి స్వర్ణపుష్పార్చన