
మద్యం మత్తు వల్లే ప్రమాదం
రామభద్రపురం: మండలంలోని జోగిందొరవలసలో ఈ నెల 21వ తేదీన వల్లం నాయుడు అనే వ్యక్తి మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి పాల్పడ్డాడని డీఎస్పీ ఎస్. రాఘవులు తెలిపారు. జొగిందొరవలసలో ట్రాక్టర్ ప్రమాదానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రమాదానికి సంబంధించి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి మండలం మోసూరువలసకు చెందిన వంగపండు వల్లంనాయుడు, మోసూరు భాస్కరరావు, లక్ష్మణరావులు స్నేహితులు. అయితే వల్లంనాయుడు స్నేహితులిద్దరికి ఫోన్చేసి మద్యం తాగుదాం రమ్మని ఆహ్వానించాడు. ముగ్గురులో ఇద్దరు ద్విచక్రవాహనంపై, ఒకరు బ్లేడ్ ట్రాక్టర్పై రామభద్రపురం మండలంలోని జోగిందొరవలస గిరిజన గ్రామానికి వెళ్లి అక్కడ మందు తాగారు. ఆ తర్వాత వల్లంనాయుడు మద్యం మత్తులో భాస్కరరావు బైక్ తాళం తీసుకున్నాడు. నా తాళం ఇవ్వు అని భాస్కరరావు ఎంతసేపు అడిగినా వల్లం నాయుడు ఇవ్వలేదు. దీంతో భాస్కరరావు ట్రాక్టర్ వెళ్లనివ్వనని చెప్పి బోయినెట్పై కూర్చున్నాడు. మద్యం మత్తులో ఉన్న వల్లంనాయుడు కూడా ట్రాక్టర్ ఎక్కి స్టార్ట్ చేసి ముందుకు లాగించేశాడు. ఆ రోడ్డు గోతులమయంగా ఉండడం వల్ల ప్రమాదవశాత్తు భాస్కర రావు కింద పడిపోవడంతో ట్రాక్టర్ చక్రాలు వెళ్లిపోగా వెనుక ఉన్న బ్లేడ్స్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసిన సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు దర్యాప్తు చేశారు. ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా నిందితుడు అలా వ్యవహరించం వల్ల ప్రమాదకేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కార్యక్రమంలో ఏఎస్సై అప్పారావు పాల్గొన్నారు.
ప్రమాదానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్