
నీలయ్యవలసలో ఏనుగుల గుంపు
వంగర: మండల పరిధి నీలయ్యవలస గ్రామ సమీపంలోకి ఏనుగుల గుంపు గురువారం చేరుకుంది. రెండు రోజుల కిందట కొత్తమరువాడలో ప్రవేశించిన తొమ్మిది ఏనుగులు సీతాదేవిపురం, గంగాడ, నారంనాయుడువలస గ్రామాలను దాటుకొని నీలయ్యవలస గ్రామం అక్కసాగరం సమీపంలోకి చేరుకున్నాయి. వరి వెద, మొక్కజొన్న పంటల్లో సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఏడీకి భోజన కార్మికుల సమ్మెనోటీసు
విజయనగరం గంటస్తంభం: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ఏడీకి ఏపీ మధ్యాహ్నభోజన పథకం కార్మికులు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ 45వ కార్మిక సదస్సు నిర్ణయం ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, మెనూ చార్జీల కింద ఒక్కో విద్యార్థికి కనీసం రూ.20లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రమాద బీమాను వర్తింపజేయాలన్నారు. సమ్మెనోటీసు ఇచ్చిన వారిలో లక్ష్మి, ఉమా, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.
కూటమి నిద్ర పోతోందా?
● గిరిజన సంఘం సూటిప్రశ్న
శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీకి చెందిన గిరిజన మహిళ పురిటి నొప్పులతో అల్లాడి శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తల్లీబిడ్డలకు వైద్యం నిమిత్తం గ్రామస్తులు, కుటుంబసభ్యులు హుటాహుటిన డోలీ కట్టి వర్షం కురుస్తుండగా, జారుతున్న రాళ్లు, రప్పలు, కొండ బురద మధ్య 20కి.మీ మోసుకొచ్చి దబ్బగుంటకు చేర్చారు. అక్కడి నుంచి ఎస్.కోట ప్రభుత్వాస్పత్రిలో తరలించారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది తల్లీ బిడ్డలకు ప్రాథమిక వైద్యం అందించారు. ఈ ఘటనపై గిరిజన సంఘం నేతలు, స్థానిక యువకులు మాట్లాడుతూ కూటమి సర్కారు కొలువు తీరగానే డిప్యూటీ సీఎం గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తామన్నారు. గిరిశిఖర గ్రామాలకు డోలీ మోతలు ఉండవని కూటమి పెద్దలు సెలవిచ్చారు. మంజూరైన రోడ్డు పనులు ఎందుకు చేయడం లేదు? కూటమి పెద్దలు కునుకు నిద్రపోతున్నారా? అని మండిపడ్డారు.

నీలయ్యవలసలో ఏనుగుల గుంపు

నీలయ్యవలసలో ఏనుగుల గుంపు