
ఆర్టీసీ ఉద్యోగులలో ఆందోళన తొలగించాలి
● నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిమాండ్
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఉన్న పార్వతీపురం, పాలకొండ, సాలూరు ఆర్టీసీ డిపోల సమస్యలపై ఏపీపీటీడీ, డీపీటీఓలకు అనేక మార్లు మెమొరాండాల ద్వారా సమస్యల పరిష్కారానికి తెలియజేసినప్పటికీ ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదు. పైగా మరిన్ని సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన, అభద్రత తొలగించి జిల్లాలో పారిశ్రామిక శాంతి నెలకొల్పాలి. ఈ మేరకు బుధవారం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను, గతంలో యాజమాన్యంతో జరిగిన చర్చల్లో అంగీకరించారు. అయినప్పటికీ అమలు చేయని అంశాలపై జోనల్ కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ జరిపి సామరస్య పూర్వకంగా చేసే ఉద్యమాలకు యాజమాన్యం కనీసం స్పందించడం లేదు. ఈ పరిస్థితుల్లో ‘సమ్మె నోటీసు’ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని ఈ నెల 25 తరువాత ఎప్పుడైనా జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ చొరవ తీసుకుని సిబ్బంది సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆర్టీసీ జిల్లా, డిపో అధికారులను ఆదేశించి సమ్మె జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. కలెక్టర్కు 30 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధం
విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, 15 రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఆర్టీసీ ఎన్ఎంయూ జోనల్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు బుధవారం ఆరు జిల్లాల సంఘం నాయకులు కలిసి తమ సమస్యలు వినిపించారు. అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు. యూనియన్ నాయకులపై దౌర్జన్యం, అనారోగ్య సెలవులు పెట్టిన ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి పీజీ రాఫెల్, డిపో కమిటీ నాయకులు బి.రామారావు, ఎం.కృష్ణ, వై.విష్ణు, గురుమూర్తి, జి.ప్రభాకరరావు, ఎస్.కోట డిపో అధ్యక్ష, కార్యదర్శి ఎ.రాజయ్య, జి.వి.రమణ, తదితరులు ఉన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులలో ఆందోళన తొలగించాలి