
రాష్ట్రంలో ఆటవిక పాలన
కూటమి హయాంలో ఎక్కడ చూసినా అరాచకాలు, అఘాయిత్యాలే..
ఆడబిడ్డలకు రక్షణ కరవు
తప్పులను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్
అందులో భాగంగానే వైఎస్సార్సీపీ అధినేత జగన్, భారతమ్మలపై నిందలు
మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి పాలనలో అరాచకాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. వాటిని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఒక నిజాయితీపరుడైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. పార్వతీపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఆడబిడ్డలపై దాడులు కనిపించలేదా?
ఒక చర్చావేదికలో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు.. జర్నలిజం వృత్తిలో ఎంతో అనుభవం ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు సమాధానమిచ్చారని తెలిపారు. దానిని వైఎస్సార్సీపీ పైన.. జగన్, భారతమ్మల మీద ఆపా దించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు సమర్థనీయం కాదని, వాటితో తమకు ఏం సంబంధమూ లేదని వైఎస్సార్సీపీ స్పష్టం చేసిందని.. జరిగిన పొరపాటుకు సదరు జర్నలిస్టులు కూడా క్షమాపణ చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలను కప్పిపుచ్చడానికే లోకేశ్ డైరెక్షన్లో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గిరిజన ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య బాధాకరమన్నారు.
తన బిడ్డ కనిపించలేదని గత నెల 3న ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల తర్వాత సమీపంలోనే పురుగులు పట్టి, ఆడబిడ్డ మృతదేహం కనిపించిందని.. బీరు సీసాతో దారుణంగా ఆమెను హత్య చేసినట్టు తెలుస్తోందని తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే చనిపో యిందని.. వారే సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని చెప్పారు.
అదే అనంతపురంలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై 14 మంది టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా లైగింక దాడికి పాల్పడినా ఏ ఒక్కరూ స్పందించలేదన్నారు. నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి పోయిందన్నారు. పట్టపగలే వారికి రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా మరుగునపర్చడమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
నాడు విజయమ్మ, భారతమ్మల మీద వ్యాఖ్యలు చేయడం తప్పు కాదా?
ఆత్మగౌరవం, మహిళల మనోభావాలంటూ మాట్లాడుతున్న టీడీపీ నాయకులకు.. నాడు విజయమ్మ, జగన్ సతీమణి భారతమ్మలపై నిందలు వేసి, దుర్భాషలాడటం తప్పు అనిపించలేదా? అని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. వారూ మహిళలే కదా, వారికి ఆత్మాభిమానం ఉండదా? వారికి ఇప్పుడు క్షమాపణ చెబుతారా? అని నిలదీశారు. ‘నాడు మాజీ మంత్రి సుచరితపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు.. రోజాపై టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణ, చేబ్రోలు కిరణ్ తదితరులు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో గుర్తు లేదా? మీ ఐ–టీడీపీలోనే నీచంగా, నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేశారు. ఐ–టీడీపీ చంద్రబాబు, లోకేశ్ల కోసం పని చేయడం నిజం కాదా? దానికి బాధ్యత వహిస్తూ వారిద్దరూ క్షమాపణ చెబుతారా?’ అని ఆమె ప్రశ్నించారు.
పౌరుల రక్షణ కోసం పోలీసు శాఖ కాదా..
పోలీసు శాఖ ఎవరి కోసం పని చేస్తోందని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. పౌరుల రక్షణ ఆ శాఖ బాధ్యత కాదా? అన్నారు. ‘రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఒక్క సమీక్ష అయినా చేశారా? అక్రమ కేసులు, అరెస్టులు.. రెడ్బుక్ అమలు.. ఇదే మీకు తెలిసిన పాలన. ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీదా కేసులు పెడతారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంద’ని తెలిపారు. పోలీసు వ్యవస్థను రెడ్బుక్ రాజ్యాంగం అమలు కోసం కాకుండా.. ప్రజలు, పిల్లల రక్షణ కోసం ఉపయోగించాలని సూచించారు.
జగన్ను తిట్టడానికే హోంమంత్రి పదవి
శాంతిభద్రతల పరిరక్షణలో హోంమంత్రి అనిత పూర్తిగా విఫలమయ్యారని పుష్పశ్రీవాణి విమర్శించారు. జగన్ను, ఆయన కుటుంబాన్ని తిట్టడానికే ఆ పదవి ఇచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ‘సింహాచలం దుర్ఘటనను సమీక్షించింది కూటమి నాయకులు, కార్యక్రమాన్ని నిర్వహించింది వారే.. భక్తులు చనిపోయిన తర్వాత కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించలేద’ని అన్నారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోందన్నారు. మారుమూల జియ్యమ్మవలస, కొమరాడ మండలంలో చిన్నపిల్లల వద్దే దొరుకుతోందని చెప్పారు.
గంజాయి వల్లే అఘాయిత్యాలు పెరుగుతున్నాయని తెలిపారు. వంద రోజుల్లో ఈ మాదక ద్రవ్యాన్ని నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. వెయ్యి రోజులైనా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. గంటకు సుమారు ముగ్గురిపైన.. రోజుకు కనీసం 70 మందిపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? అని నిలదీశారు. ప్రెస్మీట్లు, బూతులు మాట్లాడానికే హోం మంత్రి పరిమితమయ్యారన్నారు. ఆడపిల్లల మీద ఇన్ని దుర్ఘటనలు జరుగుతున్నా ఏ రోజైనా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారా? అని ప్రశ్నించారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని.. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని పుష్పశ్రీవాణి అన్నారు.
మహిళాభ్యున్నతికి పాటుపడిందే జగన్..
మహిళాభ్యున్నతి అని గొప్పలు చెప్పుకొంటున్న కూటమి నాయకులు.. వారి కోసం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ఏం చేశారని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మహిళాభ్యున్నతి, సాధికారికత శ్రద్ధ, చిత్తశుద్ధి ఎక్కడ ఉందన్నారు. వెన్నుపోటు తప్ప ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన వీరికి లేదన్నారు. ఆడబిడ్డలకు ఇస్తామన్న తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళాభ్యున్నతి జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. దాదాపు 11 పథకాలు వారి కోసమే అమలు చేశారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, వలంటీర్లలో 55 శాతం, 13 మంది జిల్లా పరిషత్ అధ్యక్షుల్లో ఏడుగురు మహిళలే అని తెలిపారు. మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి, వారికి ఆర్థిక భరోసానిచ్చారని గుర్తు చేశారు.