
అవస్థల ‘యోగాంధ్ర’
శృంగవరపుకోట:
ఎస్.కోట మండలం ముషిడిపల్లి గ్రామ సమీపంలోని సాయిదివ్యామృతం ఆశ్రమం వద్ద మంగళవారం నిర్వహించిన ఉపాధిహామీ వేతనదారులతో యోగాంధ్ర కార్యక్రమం వారిని అవస్థలకు గురిచేసింది. యోగాంధ్రకు రాకుంటే మస్తర్లు వేయ మని బెదిరించడంతో ఎస్.కోట, ఎల్.కోట, బొండపల్లి, గంట్యాడ తదితర మండలాల నుంచి అధిక సంఖ్యలో వేతనదారులు తరలివచ్చారు. యోగాసనాలు వేసేందుకు స్థలం కూడా చాలకపోవడంతో వాహనాల్లోనే ఉండిపోయారు. ఉదయం నుంచే గాలివాన కురవడంతో ఇళ్లకు చేరుకునేందుకు నానాపాట్లు పడ్డారు. ఉదయాన్నే కూలి పనికి వెళ్లి కష్టపడకపోతే పూటగడవని మాకెందుకు యోగాసనాలు అంటూ పలువురు వేతనదారులు నిట్టూర్చారు. వృద్ధులైతే విసుక్కున్నారు. యోగాసనాల వద్ద ఏర్పాటు చేసిన అల్పాహారం చాలామందికి అందకపోవడం ఆకలితో అలమటించారు. యోగా నిర్వాహకులు ఉదయం 7.15 నుంచి 7.45గంటల వరకు 30 నిమిషాల పాటు యోగాసనాలపై తర్ఫీదునిచ్చారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, మాజీ ఉపకులపతి ముత్యాలనాయుడు, ఆశ్రమ నిర్వాహకులు బాబాసాయి వివరించారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ సుధారాజు, జేసీ సేతుమాధవన్, ఎంపీపీ సోమేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, డ్వామా పీడీ శారదాదేవి, డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి, డీటీఓ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
హోర్డింగ్లు కూలి ఇద్దరికి గాయాలు
యోగాసన కార్యక్రమం పూర్తయ్యేసరికి గాలి వాన జోరందుకుంది. ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన హోర్డింగ్ కూలిపోవడంతో బొండపల్లి మండలం కనిమెరక గ్రామానికి చెందిన కొరువాడ దుర్గారావు తలకు, అదే గ్రామానికి చెందిన మన్యం లక్ష్మికి ముఖంపై గాయాలయ్యాయి. వీరిని 108లో ఎస్. కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దుర్గారావు తలకు నాలుగు కుట్లు పడ్డాయి. వైద్యసేవల వివరాలు తెలిపేందుకు ఆస్పత్రి సిబ్బంది విముఖత చూపడం, ఎవరికీ వైద్యసేవలు అందజేయలేదని చెప్పడం గమనార్హం.
వర్షంలో తడిసిముద్దయిన వేతనదారులు
హోర్డింగ్ కూలడంతో ఇద్దరు
వేతనదారులకు గాయాలు