ఆమె మాటే వింటున్నారని..! | - | Sakshi
Sakshi News home page

ఆమె మాటే వింటున్నారని..!

Jun 11 2025 7:46 AM | Updated on Jun 11 2025 7:46 AM

ఆమె మాటే వింటున్నారని..!

ఆమె మాటే వింటున్నారని..!

● ఏడాది తిరగకముందే తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల బదిలీ

● నెల్లిమర్ల టీడీపీ–జనసేన అంతర్గత పోరులో ఉద్యోగులకు తప్పని బదిలీలు

పూసపాటిరేగ: రెవెన్యూ అధికారులందరూ ఆమె మాటే వింటున్నారు.. మనం చెబితే ఒక్కపనీ చేయడం లేదు.. ఇలా అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ మనుగడ కష్టం.. అందరూ జనసేనలోనే చేరిపోతారు.. ఇప్పటికే పార్టీలోని ఓ వర్గాన్ని ఆమె లాక్కున్నారు... ఇక రాజకీయం చేయలేం.. అంటూ ఇటీవల కడపలో జరిగిన మహానాడులో నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. అంతే.. వెంటనే ‘చినబాబు’ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహసీల్దార్లను బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలివ్వడం, ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఏడాది గడవకముందే తహసీల్దార్లకు స్థానచలనం తప్పలేదన్న చర్చ నియోజకవర్గంలో జోరందుకుంది. జనసేన, టీడీపీ పార్టీలు ఆదిపత్య పోరు ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభీష్టం మేరకు ఏడాది కిందట తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల నియామకాలు జరిగాయన్నది టీడీపీ నాయకుల ఆరోపణ. అంతే.. ఏడాది తిరగక ముందే పూసపాటిరేగ, డెంకాడ , నెల్లిమర్ల, భోగాపురం మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీర్లతో పాటు వివిధ హాదాల్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగులను ఇటీవల బదిలీలు చేశారు. కొందరు కలెక్టర్‌ స్వయంగా బదిలీ చేశారని చెబుతున్నా ఇందులో నిజంలేదని మరికొందరి వాదన. ఏడాది పూర్తికాకుండా... ఎలాంటి ఒత్తిడి లేకుండా కలెక్టర్‌ అధికారులను ఎందుకు బదిలీ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నాయకుల మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్యపోరు సాగుతోంది. పలు సార్లు సమావేశాల సాక్షిగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంతో ఎమ్మెల్యేకు మద్దతుగా అధికారులు ఉన్నారని, రెవెన్యూ పరమైన పనులు చేయడం లేదని, టీడీపీ బలహీనపడుతోందని టీడీపీ నాయకులు చినబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ కారణంతోనే ఉన్నతాధికారులకు చెప్పి నాలుగు మండలాల రెవెన్యూ అధికారులను ఒకేసారి బదిలీ చేసినట్టు భోగట్టా. పూసపాటిరేగ తహసీల్దార్‌ టి.గోవిందను కలెక్టర్‌రేట్‌ సి–సెక్షన్‌, డెంకాడ తహసీల్దార్‌ వి.పద్మావతిని వంగర మండలానికి, భోగాపురం తహసీల్దార్‌ సురేష్‌ పార్వతీపురం మన్యం, నెల్లిమర్ల తహసీల్దార్‌ పి.సుదర్శనరావును సంతకవిటి మండలాలకు బదిలీ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 19 మంది తహసీల్దార్లకు బదిలీ కాగా నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగు మండలాల తహసీల్దార్లకు బదిలీ కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement