తీర్పునిచ్చిన విజయనగరం మహిళా కోర్టు
విజయనగరం క్రైమ్: నాలుగేళ్ల క్రితం జిల్లాలోని బొబ్బిలి పీఎస్ పరిధిలో నమోదైన కేసులో విచారణ అనంతరం ముద్దాయికి విజయనగరం మహిళా కోర్టు పదేళ్ల జైలుశిక్ష, రూ.15 వేల జరిమానా విధించినట్టు ఎస్పీ వకుల్ జిందల్ గురువారం వెల్లడించారు. ఆ కేసుకు సబంధించి ఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి మండలంలోని సీతయ్య పేటకు చెందిన దివనాపు అఖిల్ అంబేడ్కర్(29) పాచిపెంటకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ ఆమెకు దగ్గరై వాంఛలు తీర్చుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమని అడగ్గా నిరాకరించడంతో 2022లో బొబ్బిలి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి సీఐ నాగేశ్వరరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం మహిళ కోర్టు ఐదవ ఏడీజే పద్మావతి ముద్దాయికి శిక్ష విధించారని ఎస్పీ చెప్పారు.
ఏపీజీఈఏ ఉపాధ్యక్షుడిగా కిరణ్కుమార్
విజయనగరం ఫోర్ట్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా ఉపాధ్యక్షుడిగా ట్రెజరీ శాఖ నుంచి పీఎస్. కిరణ్కుమార్, జిల్లా జాయింట్ సెక్రటరీగా ముదిలి ఆదినారాయణలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర కార్యదర్శి ఎల్వి. యుగంధర్, పట్టణ జాయింట్ సెక్రటరీ పి. సురేష్బాబు, గజపతినగరం తాలుకా అధ్యక్షుడు బి.సింహాచలం, ఉప ఖజనా అధికారులు ఐ.రమేష్, సురేష్, శతపతిలు అభినందనలు తెలియజేశారు.
అతి ఉత్కష్ట సేవా పతకం
● కమ్యూనికేషన్ వింగ్ ఇన్స్పెక్టర్కు ప్రదానం
విజయనగనరం క్రైమ్: పోలీస్శాఖలో కమ్యూనికేషన్ వింగ్లో ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయిన పివీ.రమణమూర్తికి అతి ఉత్కష్ట సేవా పతకాన్ని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం అందజేశారు. పోలీస్ఽశాఖలో సుదీర్ఘంగా ,క్రమశిక్షణతో, సంతృప్తికరంగా, నిస్వార్ధంగా విధులు నిర్వహించిన సిబ్బందికి కేంద్రప్రభుత్వం అతి ఉత్కష్ట సేవా పతకం అందిస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ చెప్పారు. శాఖలో కమ్యూనికేషన్ వింగ్లో నిస్వార్ధంగా 38ఏళ్లు పని చేసిన రమణమూర్తి ఎంతో నిజాయితీగా క్రమశిక్షణగా విధులు నిర్వహించారని ఎస్పీ ఈ సందర్భంగా అన్నారు. అప్పట్లోనే ఇన్స్పెక్టర్ రమణమూర్తి సేవలను గుర్తించి పథకం జాబితాకు పేరు పంపారని ఎస్పీ గుర్తుచేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్ యాదవ్, పీవీ రమణమూర్తి, కిరణ్మయి పాల్గొన్నారు.
గంజాయి కేసులో నాలుగో నిందితుడి అరెస్ట్
రామభద్రపురం: గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన ఒడిశా నుంచి మధ్యప్రదేశ్కు అక్రమంగా గంజాయి రవాణాచేస్తున్న నిందితుల్లో నాలుగో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ కె నారాయణరావు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు, మండలంలోని కొట్టక్కి పోలీస్ చెక్పోస్టు వద్ద వాహన తనిఖీల్లో భాగంగా అప్పట్లో ఒడిశా నుంచి మధ్యప్రదేశ్కు అక్రమంగా రవాణాచేస్తున్న 830 కిలోల గంజాయి, లారీ, మహీంద్రా వ్యాన్, బొలెరో, కారుతో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారన్నారు.
ఆ ముగ్గురిని విచారణ చేయగా ఈ అక్రమ రవాణాలో 9 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. తొమ్మిది మందిలో నాలుగో వ్యక్తి ఎ–6 నిందితుడు ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ పోండాయ గ్రామానికి చెందిన దిలీప్ దసర్ బారక్ స్థానిక బైపాస్ రోడ్డులో సంచరిస్తుండగా గురువారం పట్టుపడ్డాడన్నారు. దీంతో నిందితుడిని సాలూరు కోర్టుకు తరలిస్తున్నామని చెప్పారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

అతి ఉత్కష్ట సేవా పతకం