సీఎస్‌లకు చేతి చమురు | - | Sakshi
Sakshi News home page

సీఎస్‌లకు చేతి చమురు

Mar 20 2025 1:03 AM | Updated on Mar 20 2025 1:02 AM

పరీక్షల నిర్వహణలో
వారిపైనే ఆర్థిక భారం

విజయనగరం అర్బన్‌: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్న’ చందంగా ఉంది పదోతరగతి పరీక్ష నిర్వహణ ఖర్చుల వ్యవహారం. ప్రభుత్వం కేటాయించిన నిధులు చాలకపోవడంతో పరీక్షల నిర్వహణ అధికారులకు చేతిచమురు వదులుతోంది. చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులకు పరీక్షగా మారుతోంది. పరీక్షలు పూర్తయ్యేవరకు ఒక్కో విద్యార్థికి కేటాయించిన రూ.10 సరిపోకపోవడంతో కనీసం రూ.100 వరకు సొంత నిధుల నుంచి వెచ్చించాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యేలోగా కేటాయింపులు పెంచాలని, ఇన్విజిలేటర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్‌ను పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.1.42 చొప్పున ఏడు పరీక్షలకు రూ.10లు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. 2018లో ఒక్కో విద్యార్థికి కంటింజెంట్‌ చార్జీగా రూ.5.50 మాత్రమే ఇవ్వగా పెరిగిన ధరల మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023లో ఆ చార్జీని రూ.8కి, మరుసటి ఏడాది రూ.10కి పెంచింది. ఈ ఏడాది చార్జీల పెంపు విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నది ఉపాధ్యాయ సంఘాల మాట. పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించే చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ప్రశ్న పత్రాలను తీసుకొని వచ్చి, పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను సీల్‌ చేస్తారు. ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలకు వేర్వేరుగా సంచులు వాడతారు. ఒక్కో సంచికి రెండు నుంచి మూడు మీటర్ల వస్త్రం కొనుగోలుకు, జవాబు పత్రాలను పోస్టాఫీస్‌కు తీసుకుని వెళ్లడానికి రవాణా ఖర్చులను భరించాల్సి వస్తోంది. జవాబు పత్రాలను కట్టి భద్రపరిచేందుకు లక్క, కొవ్వొత్తి, ధారం, స్కెచ్‌ పెన్నులు, స్టాప్‌లర్లు, గమ్‌, వైట్‌నర్‌ తదితర వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పరీక్ష కేంద్రంలో మంచినీరును అందుబాటులో ఉంచాలి. ఒక పరీక్ష కేంద్రంలో 100 మంది విద్యార్థులుంటే అక్కడి నిర్వాహణకు రూ.10 వంతున రూ.1,000 కంటింజెన్సీ నిధులు వస్తాయి. ఆ సెంటర్‌కి కావాల్సిన అన్ని వస్తువులను కొనాలంటే ఎంతలేదన్నా రోజుకు కనీసం రూ.600కు పైగా ఖర్చవుతుంది. ఈ లెక్కన కనీసం రూ.6 వేలు వరకు కంటింజెన్సీ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒక్కో విద్యార్ధికి రోజుకి 1.42 ఇస్తే ఎలా సరిపోతుందని చీఫ్‌లు ప్రశ్నిస్తున్నారు.

ఇంటర్‌ పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు రోజుకు రూ.150 వంతున రెమ్యూనరేషన్‌ ఇస్తుండగా పదో తరగతి ఇన్విజిలేషన్‌కు మాత్రం రోజుకు కేవలం రూ.33 ఇస్తున్నారు. అటెండర్‌కు రూ.20, వాటర్‌ బాయ్‌కి రూ.17 వంతున భృతిని చెల్లిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అంతకు ముందు కంటే సీఎస్‌, డీఓలకు రూ.22, ఇన్విజిలేటర్లు, క్లర్క్స్‌కు రూ.11, అటెండర్లకు రూ.6.80, వాటర్‌ బాయ్‌కి రూ.6 చొంపున పెంపుదల చేసింది. మరోవైపు ఇంటర్‌, పదోతరగతి పరీక్షలకు పెద్దగా తేడా లేకున్నా, రెమ్యూనరేషన్‌ చెల్లింపులో మాత్రం తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిర్వహణ ఖర్చులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఇన్విజిలేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చీఫ్‌, డీఓ, కస్టోడియన్లకు రోజుకు ఇచ్చేది

రూ.66

రూ.33

రూ.17

ఇదీ లెక్క...

ఇన్విజిలేటర్లకూ అన్యాయమే

ప్రతి పరీక్ష కేంద్రంలో నిర్వహణ బాధ్యత చీఫ్‌ సూపరింటెండెంట్ల (సీఎస్‌)దే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్ష నిర్వహణకు 186 మంది చీఫ్‌లు హాజరవుతున్నారు. ప్రభుత్వం నిధులను తక్కువగా విడుదల చేస్తుండడంతో అదనంగా అయ్యే ఖర్చును వారి చేతి నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా భరించాల్సి ఉంటుందని పలువురు చీఫ్‌లు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.15 ఇవ్వాలని, అదనంగా రవాణా చార్జీలు మంజూరు చేయాలని చీఫ్‌లు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉమ్మడి

విజయనగరం జిల్లాలోని

పరీక్ష కేంద్రాలు

186

ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఇవ్వాలి

ప్రస్తుత ధరలకు అనుగుణంగా రెమ్యూనిరేషన్‌ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు కంటింజెంట్‌ చార్జి పరీక్షల నిర్వహణకు ఏ మూలకూ సరిపోవడం లేదు. ప్రభుత్వం సీఎస్‌, డీవోలతో పాటు ఇన్విజిలేటర్లకు కనీస చార్జీలు చెల్లించక పోవడం దురదృష్ణకరం.

– జేఏవీఆర్‌కే ఈశ్వరరావు,

జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్‌

రెమ్యూనరేషన్‌ను పెంచాలి

ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు చేస్తున్న కేటాయింపులు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఒక విద్యార్థికి ఒక పేపరుకు చెల్లిస్తున్న రూ.1.42 కంటింజెంట్‌ చార్జి ఏ విధంగా సరిపోతాయో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ఇన్విజిలేటర్లకు రోజుకు కనీసం రూ.150, చీఫ్‌, డీఓ, కస్టోడియన్లకు రోజుకు రూ.200 వంతున కేటాయించాలి. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి.

– బంకపల్లి శివప్రసాద్‌,

ఉత్తరాంధ్ర మీడియా ఇన్‌చార్జ్‌, పీఆర్‌టీయూ

సీఎస్‌లకు చేతి చమురు 1
1/6

సీఎస్‌లకు చేతి చమురు

సీఎస్‌లకు చేతి చమురు 2
2/6

సీఎస్‌లకు చేతి చమురు

సీఎస్‌లకు చేతి చమురు 3
3/6

సీఎస్‌లకు చేతి చమురు

సీఎస్‌లకు చేతి చమురు 4
4/6

సీఎస్‌లకు చేతి చమురు

సీఎస్‌లకు చేతి చమురు 5
5/6

సీఎస్‌లకు చేతి చమురు

సీఎస్‌లకు చేతి చమురు 6
6/6

సీఎస్‌లకు చేతి చమురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement