వంగర: మండల పరిధి మడ్డువలస కుడి ప్రధాన కాలువలో గల్లంతైన కళింగ సైనీ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఈ నెల 11వ తేదీన ఇద్దరు బిడ్డలతో సహా తల్లి కళింగ శ్రావణి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు దిగువ భాగం కుడిప్రధాన కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం పాఠకులకు విదితమే. ఈ సంఘటనలో మహిళ కళింగ శ్రావణి, బాలుడు కళింగ సిద్ధులను సంగాంకు చెందిన జన్ని జగన్మోహన్(చిన్న) సాహసించి కాపాడి ఒడ్డుకు చేర్చగా బాలిక కళింగ సైనీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో గజ ఈతగాళ్లు, పలువురు మత్స్యకారులు గాలించినా ఫలితం లేకపోయింది. చీకటి పడడంతో బంధువులంతా అక్కడే పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో బాలిక సైనీ మృతదేహం ఉన్నట్లు బంధువులు గుర్తించారు. బాలిక మేనమామ గుంట చంటి, కుటుంబసభ్యులు కాలువ నుంచి మృతదేహాన్ని తీసే ప్రయత్నంలో వారు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన అనంతరం పోలీసులు రాజాం సీహెచ్సీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కింజంగి గ్రామానికి తరలించగా మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన వారంతా చలించిపోయారు. బాలిక తండ్రి కళింగ సుధాకర్ను బాలిక మృతదేహం వద్దకు తీసుకువచ్చినా ఆయన మానసిక స్థితి బాగోలేక బిత్తర చూపులు చూశాడు.
మడ్డువలస కాలువలో బాలిక మృతదేహం లభ్యం