
కిడ్నీల పట్ల శ్రద్ధ చూపాలి
● నొప్పి మాత్రలు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ సమస్యలు
● నెలకు 1200 నుంచి 1500 వరకు కేసుల నమోదు
విజయనగరం ఫోర్ట్: మానవ శరీరంలో కిడ్నీలు అతి ముఖ్యమైనవి. కిడ్నీ సమస్యలపై అశ్రద్ధ చేస్తే మృత్యువాతపడే ప్రమాదం ఉంది. కిడ్నీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కిడ్నీ సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు తలెత్తిన వెంటనే చికిత్స చేయించుకుంటే సురక్షితంగా జీవించవచ్చు. ప్రతి10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు పలు ఆధ్యయనాల్లో తేలింది. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం. అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, అంటు వ్యాధులు, మాదక ద్రవ్యాల వినియోగం మూత్ర పిండాల వ్యాధికి ప్రధాన కారణం. నొప్పి మాత్రలు అధికంగా వాడడం, కిడ్నీలో రాళ్లు పెరగడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది.
కిడ్నీ వ్యాధి వల్ల కలిగే సమస్యలు
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు, బలహీనమైన ఎముకలు, గుండె వ్యాధి, కిడ్నీ వైఫల్యం(చివరి దశ మూత్ర పిండ వ్యాధి) సమస్యలు వస్తాయి. పింక్, డార్క్ మూత్రం(మూత్రంలో రక్తం) కష్టమైన బాధాకరమైన మూత్రవిసర్జన, అధిక మూత్ర విసర్జన, దాహం పెరగడం అలసట, బలహీనత, ఉబ్బిన చేతులు, ముఖం, పాదాలు, నురుగుమూత్రం కిడ్నీ వ్యాధి లక్షణాలు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఆరోగ్యకరమైన జీవన శైలి నిర్వహించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి. బరువును నియంత్రించుకుని, సమత్యుల ఆహారం తీసుకోవాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను పర్యవేక్షించుకోవడం, వార్షిక శారీరక ఆరోగ్య పరీక్షలు చేయంచుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవాలి. మూత్ర పిండ వ్యాధిని గుర్తించడానికి స్క్రీనింగ్ చేయించుకోవాలి.
నెలకు 1200 నుంచి 1500 వరకు రోగుల నమోదు
జిల్లాలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో నెలకు వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వస్తున్నారు. నెలకు 1200 నుంచి 1500 మంది వరకు రోగులు ఆస్పత్రుల్లో నమోదవుతున్నారు. కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకున్న రోగులు 400 నుంచి 500 మంది వరకు ఉన్నారు. కిడ్నీ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కిడ్నీ వ్యాధి గ్రస్తుల సంఖ్య బాగా పెరుగుతోంది. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేక పోవడం వల్ల వారు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నారు.
బీపీ, సుగర్ అదుపులో ఉంచుకోవాలి
కిడ్నీ సమస్యలను ప్రాధమిక దశలో గుర్తిస్తే వ్యాధితీవ్రతను తగ్గించవచ్చు. బీపీ, సుగర్ వంటి వ్యాధులను అదుపులో ఉంచుకోవాలి. శారీరక శ్రమ ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయమం చేయాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. శరీరంలో కొవ్వు పరిస్థితిని ఆరోగ్య పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. కిడ్నీలో రాళ్లు పెరగకుండా చూసుకోవాలి. నొప్పిమాత్రలు అధికంగా వాడడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
డాక్టర్ రెడ్డి శివకుమార్, నెఫ్రాలజిస్టు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

కిడ్నీల పట్ల శ్రద్ధ చూపాలి

కిడ్నీల పట్ల శ్రద్ధ చూపాలి