విజయనగరం టౌన్: విజయనగరం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా గూడూరు ఆర్టీఓగా పనిచేస్తున్న జి.ఆర్.రవీంద్రనాథ్ పదోన్నతిపై రానున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు అందాయి. 1988లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్గా రవాణా శాఖలో అడుగుపెట్టారు. ఆయన గతంలో అనకాపల్లి ఆర్టీఓగా పనిచేశారు. ఇక్కడ ఆర్టీఓగా విధులు నిర్వహిస్తున్న జి.ఆదినారాయణ గూడూరు ఆర్టీఓగా బదిలీ అయ్యారు.
త్వరితగతిన
నాడు–నేడు పనులు
రేగిడి: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మనబడి నాడు–నేడు పథకం రెండో విడత పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.లింగేశ్వరరెడ్డి సూచించారు. రేగిడి ఎమ్మార్సీలో నాడు–నేడు పనులపై హెచ్ఎంలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12 నాటికి ప్రతీ పాఠశాలలో పది కాంపోనెంట్లకు సంబంధించి అన్ని పనులను సక్రమంగా, త్వరగా జరిగేలా చూడాలని సూచించారు. ఏయే పాఠశాలల్లో మిగులు నిధులు ఉన్నాయో, ఏయే పాఠశాలలకు ఎంత నిధులు అవసరమో సత్వరమే నివేదిక అందజేయాలన్నారు. పాఠశాలల ప్రారంభోత్సవం నాటికి అన్ని పాఠ్యపుస్తకాలను అందజేయాలని ఎంఈఓ ఎం.వి. ప్రసాదరావును ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ.మురళీమోహన్, సీఆర్పీలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
విజయనగరం ఫోర్ట్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ)గా డాక్టర్ ఎస్.భాస్కరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఆంధ్రా మెడికల్ కాలేజ్లో పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పీహెచ్సీల సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభు త్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ సేవలు సమర్ధవంతంగా అమలయ్యేలా చూస్తానని చెప్పారు. మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు సిబ్బందితో కలిసి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు.
సప్లిమెంటరీ పరీక్షకు 1052 మంది హాజరు
విజయనగరం పూల్బాగ్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 33 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు (తెలుగు) ప్రశాంతంగా జరిగాయి. 1334 మంది విద్యార్థులకు 1052 మంది హాజరుకాగా, 282 మంది గైర్హాజరైనట్టు డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. స్క్వాడ్ బృందాలు 14 కేంద్రాలను, డీఈఓ రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారన్నారు.
రైలు ప్రమాద బాధితులను ఆదుకుంటాం
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం టౌన్: ఒడిశాలో కోరమండల్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లు శుక్రవారం రాత్రి పట్టాలు తప్పాయి. సుమారు 13 భోగీలు పట్టాలు తప్పగా, నాలుగు భోగీలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. 50 మందికిపైగా మృతిచెందగా, 179 మందికి పైగా గాయాలపాలైనట్టు ప్రాథమిక సమాచారం. ఒడిశా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. బాధితుల సమాచారం తెలుసుకునేందుకు విజయనగరం రైల్వేస్టేషన్లో టోల్ ఫ్రీనెంబర్ల 08922–221202, 221206 నంబర్లను అందుబాటులో ఉంచారు. ప్రమాదంతో పలు రైళ్లను రద్దుచేశారు. రైలు ప్రమాద బాధితుల్లో జిల్లాకు చెందిన వారు ఎవరైనా ఉంటే వారికి అండగా ఉంటామని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. రైలు ప్రమాదం చోటుచేసుకోవడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.