మహారాణిపేట : రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ యువజన విభాగం సమరోత్సాహంతో పోరాడాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం లాసన్స్బే కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం నాయకులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని జిల్లాల్లో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకుని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ఆ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులను కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ మెంటాడ స్వరూప్, ఉత్తరాంధ్ర జోనల్ అధ్యక్షులు అంబటి శైలేష్, విశాఖ జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు పాల్గొన్నారు. వీరితో పాటు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్, అల్లు అవినాష్, పృధ్వీ, వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఉత్తరాంధ్ర యువజన విభాగం
నాయకులతో శాసనమండలి ప్రతిపక్ష నేత
బొత్స సత్యనారాయణ భేటీ


