పీఎం పాలెం: మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ యువకుడు ఆదివారం రాత్రి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. ఆదివారం రాత్రి ఐటీ సెజ్ రోడ్డు నుంచి వైఎస్సార్ కాలనీ మీదుగా మద్యం మత్తులో ఉన్న యువకుడు కారు అడ్డదిడ్డంగా నడుపుతూ ముందుకు దూసుకు పోసాగాడు. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొడుతూ రోడ్డుపై పార్కుచేసి ఉన్న వాహనాలపైకి ఎక్కించేశాడు. ఈ ఘటనలో ఓ బాలికకు తీవ్ర గాయలు అయ్యాయి. స్థానిక యువత కారును వెంబడించి కొమ్మాది కూడలి వద్ద అడ్డుకున్నారు. అప్పటికే మత్తులో ఉన్న ఆ యువకుడు కారుదిగి రోడ్డుపై కూర్చుండి పోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. వైఎస్సార్ నగర్ కాలనీలో జరగిన నష్టంపై స్థానిక ఎస్ఐ ఆరా తీస్తున్నారు.


