
తుస్!
కూటమి మాస్టర్ ప్లాన్
పునః పరిశీలనలో
కేవలం
755
ఫిర్యాదులు
విశాఖ సిటీ : కూటమి ప్రభుత్వ ‘మాస్టర్ ప్లాన్’ బెడిసికొట్టింది. వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికపై చేసిన ఆరోపణలు తప్పని తేటతెల్లమైంది. కేవలం కూటమి నేతల రియల్ వ్యాపారానికి వీలుగా ప్రణాళికలో మార్పులు చేసుకోవడానికే పునఃపరిశీలన హడావుడి చేసినట్లు స్పష్టమవుతోంది. తమ వారికి లబ్ధి చేకూర్చడానికి బూటకపు ప్రకటనలు చేసి నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ చేపడితే కేవలం 755 ఫిర్యాదు అందాయి. అవి కూడా గతంలో వచ్చిన విజ్ఞప్తులే కావడం గమనార్హం. కూటమి నేతల పాచిక పారకపోయినప్పటికీ.. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి బృహత్తర ప్రణాళికలో పలు సవరణలు చేసి ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేందుకు అడుగులు వేస్తోంది.
2021లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి
వీఎంఆర్డీఏ పరిధిలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తర ప్రణాళిక–2041కు ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి 2011లో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఏళ్లు గడిచినా అది పూర్తి కాకపోవడంతో 2016లో ప్రైవేట్ కన్సల్టెంట్ సంస్థ లీ అసోసియేట్స్కు రూ.10 కోట్లకు ఆ బాధ్యతను అప్పగించారు. 2019కి కూడా అది పూర్తి కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్ప్లాన్పై దృష్టి సారించింది. దీని రూపకల్పన సమయంలో వీఎంఆర్డీఏ పరిధిలో 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. ప్రణాళికను రూపొందించేందుకు విశాఖలోని 45 రెవెన్యూ గ్రామాలు, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ గ్రామాలు, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తంగా 17,460 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. వీఎంఆర్డీఏ, రెవెన్యూ, ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సంయుక్త తనిఖీలు, సందర్శనలు నిర్వహించి వాటిన్నింటినీ పరిశీలించారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో ఆలోచన చేసి ముసాయిదా మాస్టర్ప్లాన్ను సిద్ధం చేశారు. దానికి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో 2021 నవంబర్ 8న వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్–2041కు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్పై భూటకపు ప్రకటనలు
వైఎస్సార్సీపీ హయాంలో అశాసీ్త్రయంగా ప్రణాళిక సిద్ధం చేశారని ఆరోపణలు
పునఃపరిశీలన పేరుతో నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ
కేవలం 755 ఫిర్యాదుల రాక.. అవి కూడా పాత విజ్ఞప్తులే..
కూటమి ప్రజాప్రతినిధుల చేసిన ఆరోపణలు అవాస్తవమని నిరూపణ
అయినా తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్లాన్లో మార్పులకు ఒత్తిళ్లు
తప్పుడు ఆరోపణలు పటాపంచలు
ఈ బృహత్తర ప్రణాళిక–2041పై కూటమి నేతలు ఎన్నికల ముందు నుంచి ఆరోపణలు గుప్పించారు. పాలకులకు అనుకూలంగా మాస్టర్ప్లాన్ను అశాసీ్త్రయంగా తయారు చేశారని నానా యాగీ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాస్టర్ప్లాన్పై మళ్లీ అభ్యంతరాలు స్వీకరించి కొత్త ప్లాన్ను రూపొందిస్తామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లికి జరగాలి పెళ్లి.. మళ్లీ మళ్లీ.. అన్నట్లు.. బృహత్తర ప్రణాళికపై పునఃపరిశీలనకు పూనుకున్నారు. ఇందులో గతంలో కంటే అధికంగా ఫిర్యాదులు వస్తాయని భావించారు. వాటి ద్వారా మాస్టర్ప్లాన్ అవకతవకలు జరిగాయని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేశారు. మే 22 నుంచి ఈ నెల 21 వరకు నెల రోజుల పాటు మాస్టర్ ప్లాన్పై అభ్యంతరాలను స్వీకరించారు. ఇందులో కేవలం 755 ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు. ఇవి కూడా గతంలో వచ్చిన ఫిర్యాదులుగానే తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల బూచితో తమ అనుచరుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అనుగుణంగా మాస్టర్ప్లాన్ను పూర్తిగా మార్చాలని ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా జరగడంతో కూటమి నేతలు ఏం చేయాలో పాలుపోక మాస్టర్ప్లాన్పై నోరెత్తలేక సైలెంట్ అయిపోయారు.
‘కూటమి’కి లబ్ధి చేకూరేలా?
కూటమి ప్లాన్ పారకపోయినప్పటికీ.. మాస్టర్ప్లాన్లో మార్పులు చేయాలని గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతో ఈ ప్రణాళికలో సవరణ చేయాలని అధికారులపై ఒత్తిళ్లకు దిగుతున్నట్లు సమాచారం. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల పేరుతో కూటమి నేతలు సూచించిన విధంగా ప్లాన్లో మార్పులు, చేర్పులు చేపట్టాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలు, వారి అనుచరుల స్థిరాస్తి వ్యాపారాలు, వ్యక్తిగత ఆస్తుల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రణాళికలను మార్పులు చేసుకునే ప్లాన్ చేస్తున్నట్లు కూటమిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మధురవాడ నుంచి ఆనందపురం మధ్యలోను, అలాగే అనకాపల్లిలో పలు చోట్ల మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి.