
ఎమ్మెల్యే పల్లాకు పితృ వియోగం
సీతంపేట: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం శనివారం మధ్యాహ్నం సీతంపేటలోని తన స్వగృహంలో స్వర్గస్తులయ్యారు. పల్లా సింహాచలం విశాఖ–2 ఎమ్మెల్యేగా, వుడా బోర్డు సభ్యులుగా పనిచేశారు. గాజువాక అంటే పల్లా సింహాచలంగా పేరును సార్ధకం చేసుకున్నారు. ప్రజాసేవకుడిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా విశాఖ జిల్లా వాసులకు సుపరిచితుడు. విశాఖ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం టీడీపీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు 5 గంటల వరకు సీతంపేటలోని ఆయన స్వగృహంలో పార్థివదేహం అందుబాటులో ఉంటుందని, అనంతరం కొత్త గాజువాకలోని పూర్వపు ఇంటి వద్దకు తరలిస్తారు. ఉదయం 9 గంటల తరువాత అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. పల్లా సింహాచలం పార్థివ దేహానికి కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖా మంత్రి సుభాష్, మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, శ్రీనివాస్ దంపతులు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్బాబు, వుడా ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు నివాళులర్పించారు.

ఎమ్మెల్యే పల్లాకు పితృ వియోగం