
406 యూనిట్లని చెప్పి..చేతులెత్తేశారు!
2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం జిల్లాకు 406 యూనిట్లను కేటాయించింది. రూ.16.88 కోట్ల విలువైన 32 రకాల రుణాల కోసం ఎస్సీ కార్పొరేషన్ మేలో దరఖాస్తులను ఆహ్వానించింది. లబ్ధిదారులు https:// apobmms. apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే మే 10వ తేదీని చివరి తేదీగా ప్రకటించినప్పటికీ.. సాంకేతిక సమస్యల పేరుతో మే 8వ తేదీ నుంచే వెబ్సైట్ పనిచేయడం మానేసింది. దీంతో వందలాది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అప్పుడే తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా ఆ నోటిఫికేషన్ ప్రక్రియనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో దరఖాస్తు చేసుకున్న 3,842 మంది లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ‘రెండు రోజులు ముందే వెబ్సైట్ ఆపేసి దగా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా రుణాల మంజూరునే నిలిపేయడం దారుణం. ఇది మమ్మల్ని నిలువునా మోసం చేయడమే.’అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.