
ప్రజాస్వామ్యం ఖూనీ
● కూటమి ‘మహా’ నాటకం
జీవీఎంసీలో శనివారం జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. అధికార మదంతో, ధన బలంతో కూటమి నేతలు సాగించిన అరాచకం యావత్ రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది. కేవలం 10 నెలల అధికారం కోసం.. ప్రజల చేత ఎన్నికై న ఒక బీసీ మహిళా మేయర్ను గద్దె దించేందుకు వారు పన్నిన కుట్రలు, కుతంత్రాలు హేయమైనవి. ఈ చర్యలు విశాఖ నగర ప్రతిష్టను మసకబార్చాయి. యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళ విషయంలో అధికార కూటమి సాగించిన ‘మహా’ నాటకం ఇది. – డాబాగార్డెన్స్
అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో కూటమి నేతల లక్ష్యం ఒక్కటే.. మేయర్ పదవిని ఎలాగైనా చేజిక్కించుకోవడం. ఇందుకోసం వారు నైతిక విలువలను తుంగలో తొక్కారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భయపెట్టారు. బెదిరించారు. లొంగని వారి పై ఒత్తిడి తెచ్చారు. కోట్ల రూపాయలను ఎరగా వేసి.. కొందరు కార్పొరేటర్ల ఆత్మగౌరవాన్ని కొనుగోలు చేశా రు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. కూటమి నేతలు సాగించిన కుట్రలు, కుతంత్రాలు, డబ్బు రాజకీయా లు శనివారం నగర ప్రజల ముందు బట్టబయలయ్యా యి. నెలరోజులకు పైగా సాగించిన ఈ ప్రయత్నాల్లో కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేసినా.. కార్పొరేటర్లను చివరి నిమిషం వరకు బెదిరించి, లోబరచుకోవాల్సిన దుస్థితి అధికార కూటమికి ఏర్పడింది.
అధికార దుర్వినియోగం, పోలీసుల పహారా
అవిశ్వాస తీర్మానం రోజు కూటమి నేతల అప్రజాస్వామిక చర్యలు పరాకాష్టకు చేరాయి. చివరి నిమిషం వరకు తమ సంఖ్యాబలంపై నమ్మకం లేక.. కార్పొరేటర్లు చేజారిపోతారనే భయంతో వణికిపోయారు. అవిశ్వాస సమావేశం సందర్భంగా వారి వ్యవహారశైలి చూస్తే ఇదే స్పష్టమైంది. హోటళ్లలో దాచిన కార్పొరేట్లను అక్కడి నుంచి జీవీఎంసీకి తరలించే క్రమంలో అడుగడుగునా పోలీసులను అడ్డుపెట్టుకున్నారు. వారి సమక్షంలోనే నేరుగా జీవీఎంసీలోకి బస్సు వెళ్లింది. బస్సు దిగిన తర్వాత కూడా కూటమి నేతల ఆగడాలు ఆగలేదు. కార్పొరేటర్లను బెదిరిస్తూ సమావేశ మందిరంలోకి తీసుకెళ్లారు. అనుకూలంగా చెయ్యి ఎత్తకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి ఓట్లు వేయించుకున్నారు. ఎన్ని కుట్రలు, బెదిరింపులు, ప్రలోభాలు సాగించినా, చివరికి అవిశ్వాస తీర్మాన సమయానికి వారికి దక్కిన బలం కేవలం 74 మంది మాత్రమే! చివరి నిమిషంలో తిప్పల వంశీతో పాటు మాజీ కో ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు భార్య, కోడలు వంటి వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కూటమి వైపు తిప్పుకున్నారు. వారిలో ఏ ఒక్కరు రాకపోయినా అవిశ్వాసం వీగిపోయేది.
వైఎస్సార్ సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా..
2021లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చి 59 స్థానాల్లో గెలిపించారు. టీడీపీ 29, జనసేన 3తో పాటు ఇతరులు గెలుపొందారు. బీసీ జనరల్కు రిజర్వ్ అయిన మేయర్ పదవిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూర్చోబెట్టారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే జీవీఎంసీపై కన్ను పడింది. ప్రజా తీర్పును గౌరవించకుండా, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మేయర్ను దించేందుకు కుతంత్రాలు మొదలుపెట్టారు. నాలుగేళ్ల అవిశ్వాసం నిబంధన ఉన్నప్పటికీ.. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను కొనుగోలు చేసేందుకు బహిరంగంగానే కోట్లాది రూపాయలు కుమ్మరించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు టీడీపీలోకి, మరికొందరు జనసేనలోకి జంప్ చేసి తమ నీతిమాలిన రాజకీయాన్ని ప్రదర్శించారు. కేవలం 29 మందితో ఉన్న టీడీపీ, ఫిరాయింపులతో బలం పెంచుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది.
అవిశ్వాసం సాగిందిలా..
జీవీఎంసీలో మొత్తం స్థానాలు 98కి గానూ అప్పట్లో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన వంశీకృష్ణ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానానికి ఎన్నిక జరగలేదు. దీంతో 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 111 మంది సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీ ఉంటేనే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. ఆ లెక్కన 74 మంది సభ్యుల మద్దతు కూటమికి అవసరం. ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి నేతలు తలకిందులాగా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇన్చార్జి కమిషనర్ హరేందిర ప్రసాద్కు గత నెల నోటీసులిచ్చారు. ఈ మేరకు శనివారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరిగింది. సరిగ్గా 74 మందే హాజరు కావడంతో కూటమి నెగ్గింది.
ఫిరాయింపులతో నెగ్గిన అవిశ్వాసం
డబ్బు, బెదిరింపులతో జీవీఎంసీ పీఠం కై వసం
ఒకే ఒక్క ఓటుతో గట్టెక్కిన వైనం
బీసీ మహిళా మేయర్పై కక్ష సాధింపు
యాదవ మహిళ టార్గెట్
యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్గా ఉండటం ఇష్టం లేక కూటమి నేతలు కక్షగట్టారు. ఒక బీసీ మహిళ ఆ పదవిలో ఉండటాన్ని సహించలేకపోయారు. ఆమెను గద్దె దించడమే ఏకై క లక్ష్యంగా పెట్టుకుని.. నెలల తరబడి కుట్రలు పన్నారు. ఇది కేవలం రాజకీయ అవిశ్వాసం కాదు.. ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళపై జరిగిన దాడిగా చూడాలని పలు వర్గాలకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నైతికత లేని విజయం
ఇన్ని కుట్రలు, కుతంత్రాలు, బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడినా, కూటమి నేతలు సాధించింది ఏమిటి? అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి అవసరమైన 74 మంది సభ్యులను మాత్రమే.. అదీ చివరి నిమిషంలో కొందరిని ఒత్తిడికి గురి చేసి సమీకరించగలిగారు. ఒక్క సభ్యుడు తగ్గినా వారి కుట్ర బెడిసికొట్టేది. వైఎస్సార్ సీపీ టికెట్పై గెలిచి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి, పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారిపై ఆధారపడి సాధించిన ఈ విజయం అనైతికం. నిజంగా ధైర్యం ఉంటే, ఫిరాయించిన కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామా చేసి, తిరిగి ఎన్నికలకు వెళ్లాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఒక పార్టీ జెండాపై గెలిపిస్తే.. డబ్బులకు, పదవులకు ఆశపడి పార్టీలు మారిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల తీరును అసహ్యించుకుంటున్నారు.
కార్పొరేటర్లను భయపెట్టారు
ప్రశాంతతకు మారు పేరుగా విశాఖకు మంచి పేరుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళకు మేయర్ పదవినిచ్చి గౌరవిస్తే.. యావత్ రాష్ట్రం హర్షం వ్యక్తం చేసింది. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డబ్బు సంచులతో, విపరీత ధోరణితో మహిళా కార్పొరేటర్లను సైతం భయపెట్టి మేయర్ పీఠం దక్కించుకుంది. కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
– కె.రామచంద్రమూర్తి, ీసనియర్ సిటిజన్

ప్రజాస్వామ్యం ఖూనీ

ప్రజాస్వామ్యం ఖూనీ