
కార్పొరేటర్లను పశువుల్లా కొన్నారు
సాక్షి, విశాఖపట్నం: తమ పార్టీలో గెలిచిన కార్పొరేటర్లను సంతలో పశువులు మాదిరిగా కొన్నారని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కన్నబాబు, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబుతో కలసి వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. రాచరికంలో ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని, విలువలను అపహాస్యం చేసి అవిశ్వాసం గెలిచినా.. రాజకీయంగా వాళ్లకు వాళ్లే సమాధి కట్టుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీ నాయకులను తీసుకోబోమని డిప్యూటీ సీఎం చెప్పారని, కేవలం 10 నెలల మేయర్ పీఠం కోసం ఇప్పుడు తమ కార్పొరేటర్లను ఇబ్బందులకు గురి చేశారన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తమ పార్టీ నుంచి తీసుకున్న 27 మంది కార్పొరేటర్లతో రాజీనామా చేయించి.. మీ పార్టీ గుర్తుల మీద గెలిపించి మేయర్ పదవిని దక్కించుకోవాలని సవాల్ విసిరారు. బీసీ మహి ళను దించిన పార్టీలుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన చరిత్రలో మిగిలిపోతాయని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తైనాల విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైస్రాయ్ హోటల్ రాజకీయాలే నేటికీ నడుస్తున్నాయని, విశాఖ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే 10 నెలల మేయర్ పీఠం కోసం దిగజారి రాజకీయాలు చేశారని విమర్శించారు. నాలుగేళ్లుగా నిజాయితీతో పనిచేస్తున్న బీసీ మహిళను దించడం దారుణమన్నారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానంలో అధికార బలంతో, డబ్బుందన్న అహంకారంతో ప్రత్యేక విమానాలు తీసుకుని ప్రజాధనాన్ని ఖర్చు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను, పోలీసులను, అధికారులను ఉపయోగించుకుని స్వల్ప తేడాతో గెలిచారని ఎద్దేవా చేశారు. సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ జె.సుభద్ర, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కన్నబాబు, మాజీ మంత్రి అమర్నాథ్