మేయర్‌గా ప్రయాణం సంతృప్తికరం | - | Sakshi
Sakshi News home page

మేయర్‌గా ప్రయాణం సంతృప్తికరం

Apr 20 2025 1:48 AM | Updated on Apr 20 2025 1:48 AM

మేయర్‌గా ప్రయాణం సంతృప్తికరం

మేయర్‌గా ప్రయాణం సంతృప్తికరం

● వైఎస్‌ జగన్‌ ఆశీస్సులతోనే సేవ చేసే గొప్ప అవకాశం దక్కింది ● నగర ప్రజలకు కృతజ్ఞతలు :గొలగాని హరివెంకటకుమారి

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ మేయర్‌గా నాలుగేళ్ల పాటు ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం లభించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని గొలగాని హరి వెంకటకుమారి అన్నారు. తన పదవిని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ, నగర పౌరులకు సేవలు, సంక్షేమ పథకాలు అందించడంలో, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కృషి చేశానని తెలిపారు. ఈ నాలుగేళ్ల కాలంలో నగర అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా, ప్రతి కార్పొరేటర్‌ను సమ దృష్టితో చూస్తూ.. వారి వార్డుల అభివృద్ధికి మనస్ఫూర్తిగా నిధులు కేటాయించినట్లు గుర్తు చేసుకున్నారు. ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే అవకాశం లభించిందని, ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రజలకు అండగా నిలబడి, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం గొప్ప సేవానుభూతినిచ్చిందన్నారు. అడవివరం నుంచి గోశాల వరకు రోడ్డు, జగదాంబ జంక్షన్‌ నుంచి పూర్ణామార్కెట్‌, పాత పోస్టాఫీస్‌ వరకు రోడ్లు, బస్‌బేలు, జంక్షన్ల అభివృద్ధి వంటి అనేక పనుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించినట్లు చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన కార్పొరేటర్లకు సైతం నిధుల కేటాయింపులో ఎటువంటి వివక్ష చూపలేదనే విషయం తెలుసునని హరివెంకటకుమారి అన్నారు. నాలుగేళ్ల ఒక నెల పాటు మేయర్‌ క్యాంపు కార్యాలయాన్ని తన సొంత భవనంలో నిర్వహించుకుంటూ.. కార్పొరేషన్‌ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. నగరం కాలుష్యానికి గురి కాకూడదనే ఉద్దేశంతో ప్రతి సోమవారం సొంత వాహనాన్ని వదిలి ఆర్టీసీ బస్సులో జీవీఎంసీకి వచ్చానని, ఈ విషయంలో తోటి ఉద్యోగులను కూడా ప్రోత్సహించినట్లు చెప్పా రు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశంలోనే విశాఖ గర్వించేలా ర్యాంకులు సాధించడంలో తన వంతు కృషి చేశానన్నారు. అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు మంజూరు చేసిన తనపైనే అవిశ్వాస తీర్మానం పెట్టడం బాధ కలిగించిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతోనే యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళగా తనకు ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం లభించిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన నగర ప్రజలు, అధికారులు, పార్టీ నేతలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement