
పెదగాడిలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
పెందుర్తి: మండలంలోని పెదగాడి గ్రామ సచివాలయం ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. శుక్రవారం రాత్రి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన దుండగులు రాళ్లతో బలంగా కొట్టడంతో కళ్లద్దాలు పూర్తిగా విరిగిపోయాయి. అంతేకాకుండా, విగ్రహం తలపై బలంగా రాయితో దాడి చేయడంతో బీటలు ఏర్పడ్డాయి. శనివారం ఉదయం సచివాలయానికి వచ్చిన సిబ్బంది విగ్రహాన్ని గమనించి వెంటనే సర్పంచ్ కేసుబోయిన లావణ్యకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తొమ్మిది నెలల్లో అంబేడ్కర్ విగ్రహంపై దాడి జరగడం ఇది రెండోసారి. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఇదే విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కేసును నీరుగార్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా అదే తరహా ఘటన పునరావృతం కావడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెదగాడిలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం