విప్‌ ధిక్కరిస్తే రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టే.. | - | Sakshi
Sakshi News home page

విప్‌ ధిక్కరిస్తే రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టే..

Apr 18 2025 12:56 AM | Updated on Apr 18 2025 12:56 AM

విప్‌ ధిక్కరిస్తే రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టే..

విప్‌ ధిక్కరిస్తే రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టే..

● ఫ్యాన్‌ గుర్తుతో గెలిచిన ఫిరాయింపుదారులకు మాజీ మంత్రి హెచ్చరిక ● బీసీ మహిళా మేయర్‌ను తొలగించేందుకు కూటమి కుట్రలు ● కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ సీపీ గుర్తుపై విజయం సాధించి, ఇప్పుడు పార్టీ ఫిరాయించిన 27 మంది కార్పొరేటర్లు విప్‌ ధిక్కరిస్తే.. మరో 48 గంటలు మాత్రమే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరించారు. 19న అవిశ్వాస తీర్మానంపై జరిగే కౌన్సిల్‌ సమావేశాన్ని స్నేహపూర్వక వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని గురువారం కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. అవిశ్వాస తీర్మానంపై కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని.. దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కలెక్టర్‌ను కోరామన్నారు. మీడియా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో సమావేశం జరగాలని, అసాంఘిక శక్తులను అనుమతించకూడదన్నారు. కూటమి నేతలు వైస్రాయ్‌ హోటల్‌ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించా రు. కూటమికి అనుకున్న సంఖ్యాబలం లేకపోయినా హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ సీపీ తరఫున విప్‌ జారీ చేస్తామని, ఈ మేరకు లేఖను కూడా కలెక్టర్‌కు అందించామన్నారు. వైఎస్సార్‌సీపీ గుర్తుతో గెలిచిన వారు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. విప్‌ ధిక్కరిస్తే వాళ్ల బతుకు కుక్కలు చింపిన విస్తరేనని హెచ్చరించారు. 2014లో వైఎస్సార్‌ సీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైందో కార్పొరేటర్లు గుర్తెరగాలని సూచించారు. రాజకీయ జీవితం, భవిష్యత్తు కావాలనుకునేవాళ్లు ఇలాంటి పనులు చేయరని స్పష్టం చేశారు. నిజంగా వారికి దమ్ముంటే.. పార్టీకి, పార్టీ ద్వారా వచ్చిన పదవులకు కూడా రాజీనామాలు చేయాలని అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు. పొరపాటున ఎవరైనా ఓటేస్తే విప్‌ ధిక్కరణకు గురై పదవులను కోల్పోతారని హెచ్చరించారు. మాజీ ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి విప్‌ను ధిక్కరించిన వారిపై 24 గంటల్లో న్యాయ పరమైన చర్యలు తప్పవన్నారు. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ బీసీ మహిళను 11 నెలల కాలం కూడా మేయర్‌ పీఠంపై ఉండనీయకుండా కుట్రలు పన్నుతుండటం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో విశాఖ ఉత్తర సమన్వయకర్త కె.కె.రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గ, మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement