
పార్టీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తాం
● ధిక్కరిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం ● అప్పటికీ న్యాయం జరగకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం ● శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: నగర మేయర్కు సంబంధించి అవిశ్వాస తీర్మానంపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఓటింగ్ జరగాలని కలెక్టర్ను కోరినట్లు రాష్ట్ర శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు పార్టీ నుంచి విప్ జారీ చేస్తామని, ధిక్కరించిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా అధికార బలంతో కూటమి నేతలు అడ్డుకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. లాసన్స్బే కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసి తమ పార్టీలో కొందరు కార్పొరేటర్లను లాక్కొన్నారని, పార్టీ నుంచి కొందరు ఫిరాయించినా కౌన్సిల్లో తమకు బలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 19న జరిగే అవిశ్వాస ఓటింగ్కు వైఎస్సా ర్సీపీ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ భారీ విజయం సాధించిందని, మేయర్ నాలుగేళ్లపాటు నిజాయితీగా పాలన అందించారన్నారు. బీసీలపై ప్రేమతో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి యాదవ సామాజికవర్గానికి చెందిన బీసీ మహిళకు మేయర్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కుట్రతో మేయర్ పదవిని దక్కించుకునేందుకు.. బీసీ మహిళపై అవిశ్వాసం పెట్టారన్నారు. ఈ పరిణామాలను రాష్ట్రంలోని బీసీలంతా చూస్తున్నారని.. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ఎదురు చూస్తున్నారని బొత్స అన్నారు.