
ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్ సీపీతోనే..
● కుమారుడు పార్టీ మారడంపై కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి ● దేవన్రెడ్డిని రాజకీయ వారసుడిగా ప్రకటన
పెదగంట్యాడ: వైఎస్సార్ సీపీ తనకు అమ్మ వంటిదని.. తన ప్రాణం ఉన్నంత వరకూ ఆ పార్టీతోనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి స్పష్టం చేశారు. బీసీ రోడ్డులోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డితో కలసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కుమారుడు, 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి వైఎస్సార్ సీపీని వీడి జనసేనలో చేరడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. విలేకరుల సమావేశంలో, పార్టీ నాయకుల సమక్షంలోనే ఆయన కంటతడి పెట్టారు. తన రాజకీయ వారసుడు తిప్పల దేవన్రెడ్డి అని ప్రకటించారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటామన్నారు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలు తెలిసినవే నన్నారు. గాజువాక నియోజకవర్గంలో పార్టీని మరింతగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీలో వంశీరెడ్డికి సముచిత స్థానం కల్పించామని గుర్తు చేశారు. పార్టీ చేసిన మేలును మరిచి మరో పార్టీ కండువా కప్పుకోవడం సమంజసం కాదన్నారు. వంశీరెడ్డి పార్టీ మారతానని గానీ, ఆ దిశగా ఆలోచన ఉన్నట్టు గానీ తనకు ఏనాడూ తెలియజేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం తథ్యమన్నారు.
మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కావడం ఖాయమన్నారు. గాజువాక నుంచి తన కుమారుడు తిప్పల దేవన్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు. సమావేశంలో కొండా రాజీవ్, రాజాన వెంకటరావు, పల్లా చినతల్లి, కోమటి శ్రీనివాసరావు, గొందేశి మహేశ్వరరెడ్డి, మంత్రి శంకరనారాయణ, బొడ్డ గోవింద్, కులుకూరి మంగరాజు, రోజారాణి, జీలకర్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.